హస్తినలో శరవేగంగా పరిణామాలు: మోడీ ఆరా: అందుబాటులో ఉండాలంటూ ఫోన్: ఆర్మీ చీఫ్ టూర్ రద్దు
న్యూఢిల్లీ: భారత్ చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలు హింసాత్మకంగా మారడం.. లఢక్ సరిహద్దుల్లో భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడానికి ప్రయత్నించిన చైనా సైన్యాన్ని నిలువరించే ప్రయత్నంలో ఘర్షణ చోటు చేసుకోవడం.. రెండువైపులా ప్రాణనష్టం సంభవించిన నేపథ్యంలో దేశ రాజధానిలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అనూహ్య మలుపులు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దృష్టి మొత్తం దీనిపైనే నిలిచింది.
సరిహద్దుల్లో భయానకం..
అనూహ్యంగా.. ఎలాంటి ముందుస్తు హెచ్చరికలు లేకుండా చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) సైనికులు ఈ దారుణానికి ఒడిగట్టారు. భారత భూభాగంపైకి చొచ్చుకుని వచ్చారు. వారిని నిలువరించే క్రమంలో రెండు దేశాల సైనికుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ప్రాణాలను తీసేంత స్థాయికి చేరింది. భారత్ తరఫున కల్నల్ స్థాయి కమాండింగ్ అధికారి, ఇద్దరు జవాన్లు మరణించారు. చైనా వైపు కూడా ప్రాణనష్టం సంభవించినప్పటికీ ఎంతమంది మరణించారనేది తెలియరావాల్సి ఉంది.
ఘర్షణలపై ప్రధాని ఆరా..
ఈ ఘర్షణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరా తీస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఆయన రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ఫోన్ చేశారు. పూర్తి వివరాలను తెలియజేయాలని సూచించారు. దీనిపై ఓ నివేదికను తయారు చేయాలని నరేంద్రమోడీ ఆదేశించారు. అనంతరం ఆయన విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్నూ ఫోన్లో మాట్లాడారు. ప్రాణాంతక ఘర్షణల అనంతరం చైనాపై ఎలాంటి విదేశాంగ వైఖరిని అనుసరించాలనే విషయంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది.
అందుబాటులో ఉండాలంటూ
లఢక్ సమీపంలో సరిహద్దుల్లో నెలకొన్న ఘర్షణ అనంతరం అక్కడ చోటు చేసుకున్న పరిణామాల గురించి రాజ్నాథ్ సింగ్ ప్రధానమంత్రికి ఫోన్ ద్వారా వివరించినట్లు చెబుతున్నారు. భారత్ తరఫున కల్నల్ ర్యాంకు అధికారి సహా ఇద్దరు జవాన్లు మరణించారని వివరించారు. ఈ విషయంపై తాను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్తో మాట్లాడినట్లు వెల్లడించారని అంటున్నారు. బిపిన్ రావత్ సహా అందరూ అందుబాటులో ఉండాలని ప్రధాని ఆదేశించినట్లు సమాచారం.
పఠాన్కోట్ సందర్శన రద్దు చేసుకున్న నరవణె
సరిహద్దుల్లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణె తన అధికారిక కార్యక్రమాలు పర్యటనలను రద్దు చేసుకున్నారు. ఢిల్లీలో మకాం వేశారు. షెడ్యూల్ ప్రకారం.. ఈ మధ్యాహ్నం ఆయన పంజాబ్లోని పఠాన్కోట్ ఆర్మీ క్యాంప్ను సందర్శించాల్సి ఉంది. ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ సాయంత్రం నరవణె.. రాజ్నాథ్ సింగ్, బిపిన్ రావత్తో భేటీ అవుతారని చెబుతున్నారు. ప్రధానమంత్రి సైతం నరవణెతో ఫోన్ ద్వారా సంభాషించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.
Recommended Video
ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన వెంటనే..
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఎంపిక చేసిన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా చర్చించాల్సి ఉంది. ఈ కార్యక్రం ముగిసిన వెంటనే ఆయన రాజ్నాథ్ సింగ్, సుబ్రహ్మణ్యం జైశంకర్లతో సమావేశమౌతారని అంటున్నారు. చైనాతో అనుసరించాల్సిన వైఖరిపై ఈ సమావేశంలోనే ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.