చైనా ద్వంద్వ నీతి మరోసారి బట్టబయలు... సరిహద్దులో తాజా ఉద్రిక్తతలపై భారత్ రియాక్షన్ ఇదే...
ఓవైపు తూర్పు లదాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి సైన్యం ఉపసంహరణకు కట్టుబడే ఉన్నామన్న ప్రకటనలు... మరోవైపు సరిహద్దులో స్టేటస్ కో (యధాతథ స్థితి)ని మార్చేందుకు పీపుల్ లిబరేషన్ ఆర్మీ ప్రయత్నాలు... చైనా మాటలకు,చేతలకు పొంతన లేదన్న విషయం తాజాగా మరోసారి స్పష్టమైంది. తన దుందుడుకు చర్యలతో చైనా ద్వంద్వ నీతి మరోసారి బట్టబయలైంది.
వాస్తవాధీన రేఖ వెంబడి సైన్యం ఉపసంహరణకు భారత్తో కుదిరిన అవగాహన ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించింది. అగస్టు 29,30 తేదీల్లో చైనా బలగాలు మరోసారి భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేసినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ప్యాంగాంగ్ త్సో సరస్సుకు దక్షిణాన చైనా కదలికలను ముందుగానే పసిగట్టిన భారత్... పకడ్బందీ చర్యలతో దాన్ని తిప్పికొట్టింది. ఏకపక్షంగా స్టేటస్ కోని మార్చేయాలనుకున్న చైనా ప్రయత్నాలను అడ్డుకున్నది.
తాజా ఘటనపై భారత ఆర్మీ స్పందిస్తూ... తాము ఇప్పటికీ సామరస్యపూర్వక చర్చల ద్వారా శాంతిని నెలకొల్పేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. అదే సమయంలో ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునే విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసింది. తాజా ఘటన నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి చైనా భూభాగంలోని చుషుల్లో ఇరు దేశాల మధ్య బ్రిగేడ్ కమాండర్ స్థాయి సమావేశం జరుగుతోంది.
SITUATION UPDATE: EASTERN #LADAKH@adgpi is committed to maintaining peace through dialogue but is also equally determined to protect its territorial integrity. A Brigade Commander level Flag meeting is in progress at Chushul to resolve the issues
— PIB India (@PIB_India) August 31, 2020
Read: https://t.co/8u9cELAkvB
Recommended Video
కాగా,జూన్ 15న తూర్పు లదాఖ్లోని గాల్వన్ లోయలో భారత్-చైనా బలగాల ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. చైనా వైపు కూడా 40 మంది జవాన్లు మరణించారని భారత ఆర్మీ వర్గాలు చెప్పినప్పటికీ... ఆ దేశం మాత్రం దానిపై స్పష్టత ఇవ్వలేదు. ఈ ఘటన తర్వాత భారత్ చైనాకు గట్టిగా బుద్ది చెప్పింది. టిక్టాక్ సహా ఆ చైనాకు చెందిన 59 యాప్స్పై నిషేధం విధించింది. అలాగే 5జీ ట్రయల్స్కు కూడా చైనాకు చెందిన హువావే,జెడ్టీఈ కంపెనీలను దూరం పెట్టే యోచనలో ఉంది.