భారత సైన్యం కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని కెరణ్ సెక్టార్లో భారత్లోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం కాల్చి చంపింది. ఆగస్ట్ 15న జరిగే స్వాతంత్ర్య దినోత్సవాలకు విఘాతం కలిగించడమేకాక భారీ దాడులు జరపాలనే లక్ష్యంతో పాక్ ప్రేరిత ఉగ్రవాదులు సరిహద్దు దాటి వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
వీరిని సరిహద్దు దాటించేందుకు పాక్ బలగాలు భారత జవాన్ల ఔట్పోస్ట్లపై దాడులు పాల్పడుతున్నాయి. కాల్పులను భారత సైన్యం తిప్పికొడుతూ ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకుంటోంది. పూర్తి అప్రమత్తంగా ఉంటోంది.
గురుదాస్పూర్ ఘటనతో పాటు ఉధంపూర్లో నవేద్ అలియాస్ ఉస్మాన్ సజీవంగా పట్టుబడిన నాటి నుంచీ పాక్ పెద్ద ఎత్తున కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది.
ఉగ్రవాదుల కాల్పుల్లో జవాను మృతి
ఇది ఇలా ఉండగ, పాక్ ఉగ్రవాదులు తంగ్ధర్ సెక్టార్ వద్ద భారత్లోకి చొరబడేందుకు యత్నించారు. ఉగ్రవాదుల ప్రయత్నాలు తిప్పికొట్టే క్రమంలో వారు భారత జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక జవాను మృతి చెందారు. మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.