భారత సైన్యంలోకి అపాచీ: ఒక్కటి వందమంది పెట్టు
భారత సైన్యం మరికొన్ని అస్త్రాలను తన అమ్ముల పొదిలో చేర్చుకుని మరింత రాటుదేలబోతోంది. తొలిసారిగా తన అమ్ములపొదిలో దాడి హెలికాప్టర్లను సమకూర్చుకోబోతోంది.
న్యూఢిల్లీ: భారత సైన్యం మరికొన్ని అస్త్రాలను తన అమ్ముల పొదిలో చేర్చుకుని మరింత రాటుదేలబోతోంది. తొలిసారిగా తన అమ్ములపొదిలో దాడి హెలికాప్టర్లను సమకూర్చుకోబోతోంది. సైన్యం కోసం అమెరికా నుంచి ఆరు అధునాతన అపాచీ హెలికాప్టర్ల కొనుగోలుకు రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన సమావేశమైన రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) పచ్చజెండా వూపింది. రూ.4,168 కోట్ల విలువైన ఈ ప్రతిపాదన దీర్ఘకాలంగా పెండింగ్లో ఉంది. దీనికితోడు అధునాతన గ్రిగోరివిచ్ శ్రేణి స్టెల్త్ యుద్ధనౌకల రూ.490 కోట్లతో రెండు జోర్యా గ్యాస్ టర్బైన్ ఇంజిన్లను కొనుగోలు చేయడానికి కూడా డీఏసీ ఆమోదం తెలిపింది.
దాడి హెలికాప్టర్లపై అజమాయిషీ కోసం భారత సైన్యానికి, వైమానిక దళానికి మధ్య కొన్నేళ్లుగా పోరు నెలకొంది. నేల మీద కదిలే సైన్యానికి గగనతలం నుంచి రక్షణ కల్పించడమే వీటి ప్రధాన ఉద్దేశమని, అందువల్ల అవి తమ వద్దే ఉండాలని సైనిక అధినాయకత్వం వాదించింది. ఈ వాదనను వైమానిక దళం కొట్టి పారేసింది. సైన్యం వద్ద ప్రస్తుతం ఆయుధాల్లేని హెలికాప్టర్లు ఉన్నాయి.
వీటిని రవాణా, నిఘా కోసం ఉపయోగిస్తున్నారు. దాడి హెలికాప్టర్లలో భారీగా క్షిపణులు, బాంబులు, భారీ తుపాకులు ఉంటాయి. ప్రస్తుతం వైమానిక దళం వద్ద రష్యా తయారీ ఎంఐ-25/35 దాడి హెలికాప్టర్లు ఉన్నాయి. పాక్షిక సామర్థ్యం కలిగిన ఈ లోహవిహంగాలు పాతబడిపోయాయి. ఈ నేపథ్యంలో మునుపటి యూపీఏ ప్రభుత్వం.. 22 అపాచీ హెలికాప్టర్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అవి వైమానిక దళానికే చెందుతాయని స్పష్టంచేసింది. భవిష్యత్లో కొనుగోలు చేసే ఈ శ్రేణి లోహ విహంగాలు మొత్తం సైన్యానికే దక్కుతాయని తేల్చి చెప్పింది.
ఈ ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలతోనే మరో 11 అపాచీల కోసం ఆర్డర్ ఇచ్చే హక్కు భారత్కు ఉంటుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ కోసం 11 హెలికాప్టర్లను కొనుగోలు చేయాలని సైన్యం కోరింది. వైమానిక దళం, రక్షణ శాఖలోని ఆర్థిక విభాగం అభ్యంతరాల నేపథ్యంలో ఆరు అపాచీలకే అరుణ్ జైట్లీ సారథ్యంలోని డీఏసీ ఆమోదం తెలిపింది.
ఇవీ అపాచీ ప్రత్యేకతలు
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దాడి హెలికాప్టర్లని వీటికి పేరు. వీటిని బోయింగ్ సంస్థ తయారుచేస్తున్నది. అంతేకాదు. పలు రకాల విధులు ఒకేసారి నిర్వర్తించడంతోపాటు శత్రువుల యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసేయడంలో ఇవి దిట్ట అంటే అతిశయోక్తి కాదు. ఈ హెలికాప్టర్లో ఏర్పాటుచేసిన రాడార్ల సాయంతో ఇది రాత్రి, పగలు అనే తేడా లేకుండా పోరాటం చేయగల సామర్థ్యం వీటి సొంతం.
లేజర్, పరారుణ, ఇతర వ్యవస్థలతో లక్ష్యాల గుర్తింపు, దాడి చాలా తేలికవుతుంది. వీటిలో పలు ప్రధాన వ్యవస్థలను అదనంగా ఏర్పాటుచేశారు. అటువంటి వాటిలో రెండు టర్బో షాఫ్ట్ ఇంజిన్లు ఉంటాయి. వీటిలో లేజర్ గైడెడ్ హెల్ ఫైర్ క్షిపణులు, 70 ఎంఎం రాకెట్లు, 30 ఎంఎం ఆటోమేటక్ తుపాకీ కలిగి ఉంటుంది. అంతేకాదు. 12 వేల తూటాలతో వినియోగానికి సిద్ధంగా ఉంటుంది.
గగనతలం నుంచి గగనతలంలోని ప్రయోగించే క్షిపణులనూ మోసుకెళ్లగల సామర్థ్యం వీటి సొత్తు. 60 సెకన్లలోపే 128 లక్షాలను విశ్లేషించడంతోపాటు శత్రువుల దాడి నుంచి శరవేగంగా, తేలిగ్గా తప్పించుకోగలవు. ఇవి గంటకు గరిష్ఠంగా 284 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు. వీటిలో సెల్ఫ్ సీలింగ్ ఇంధన వ్యవస్థ ఏర్పాటు చేయడంతో ఇంధన లీకేజీ ఉండదు. వీటిని ఇప్పటికే అమెరికా పలు యుద్ధాల్లో విస్త్రుతంగా నినియోగించింది. గ్రీస్, జపాన్, ఇజ్రాయెల్, నెదర్లాండ్స్, సింగపూర్, యూఏఈ వంటి దేశాల అమ్ముల పొదిలో ఇవి ఉన్నాయి.