ఘర్షణ: ఇద్దరు జవాన్లను కాల్చి చంపి, ఆత్మహత్యకు పాల్పడ్డ మరో జవాను
ధర్మశాల: హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు జవాన్లతో గొడవ పెట్టుకున్న జస్బిర్ సింగ్ అనే సిపాయి వారిపై తుపాకీతో కాల్పులు జరిపి, అనంతరం తానూ కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ ఘటన కాంగ్రా జిల్లా ధర్మశాల కంటోన్మెంట్లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై కాంగ్రా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 18 సిక్ రెజిమెంట్ జవాను జస్బిర్ సింగ్ సోమవారం తెల్లవారుజామున ఈ ఘటనకు పాల్పడ్డాడని తెలిపారు. ఈ కాల్పుల్లో హవల్దార్ హర్దీప్ సింగ్, నాయక్ హర్పాల్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
అనంతరం జస్బిర్ సింగ్ కూడా కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. వారి ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. జస్బిర్ సింగ్ ఏడాదిన్నర క్రితం ఆర్మీలో చేరగా, హర్దీప్ సింగ్ 23ఏళ్లుగా, హర్పాల్ సింగ్ 18ఏళ్లుగా అందులో సేవలందిస్తున్నారు.
పని ముగించుకున్న తర్వాత తన గదికి వచ్చిన జస్బిర్ సింగ్.. ఏదో విషయంపై తన తోటి జవాన్లు హవల్దార్ హర్దీప్ సింగ్, నాయక్ హర్పాల్ సింగ్లతో గొడవ పెట్టుకుని, తీవ్ర ఆగ్రహానికి గురై ఈ దారుణానిిక పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందని కల్నల్ నవదీప్ బ్రార్ తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న మిలటరీ అధికారులతోపాటు కాంగ్రా పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు.