గాల్వన్ ఘర్షణ: అమరుడైన మరో జవాను, తోటి సైనికులను కాపాడే యత్నంలో గాయాలు
ముంబై: సరిహద్దులో భారత్-చైనాల మధ్య జూన్ 15న చోటు చేసుకున్న ఘర్షణలో మరో జవాను అమరుడయ్యారు. ఈ ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని మాలేగావ్ తాలూకా సాకురి గ్రామానికి చెందిన సచిన్ విక్రమ్ మోరే గురువారం వీర మరణం పొందారు.
గల్వాన్లో విధి నిర్వహణలో ఉండగా, నదిలో పడిపోయిన ఇద్దరు జవాన్లను కాపాడే ప్రయత్నంలో విక్రమ్ అమరుడయ్యారని మహారాష్ట హోంమంత్రి సతేజ్ పాటిల్ తెలిపారు.
మరోవైపు భారత్-చైనాల మధ్య సరిహద్దు వివాదంపై చర్చలు జరుగుతున్నాయి. అయితే, సరిహద్దులోని ఘర్షణ ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకుందామని ఒకపక్క భారత్కు చెబుతూనే.. మరోపక్క వాస్తవాధీన రేఖ వెంబడి బలగాలను మోహరిస్తోంది డ్రాగన్ దేశం.
ఈ క్రమంలో భారత్ కూడా భారీ ఎత్తున సైనిక బలగాలను మోహరిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్ రాష్ట్రాల వెంబడి సరిహద్దు ప్రాంతాల్లో భారత భద్రతా బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. చైనా మరోసారి ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా ధీటుగా జవాబిచ్చేందుకు సిద్ధంగా ఉంది భారత సైన్యం.
ఇది ఇలావుండగా, సరిహద్దుల్లో పరిస్థితులు, సైనిక సన్నద్ధతపై ప్రధాని నరేంద్ర మోడీకి వివరించనున్నారు భారత సైన్యాధిపతి మనోజ్ ముకుంద్ నరవణే. భారత్-చైనా సరిహద్దుల్లో ఆర్మీ చీఫ్ రెండు రోజుల పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం ప్రధాని మోడీని కలిసి సరిహద్దు వద్ద పరిస్థితిని వివరించనున్నారు.