రూ.5 వేల కోట్ల వ్యయం: ఎమర్జెన్సీగా కొనుగోలు చేసిన ఆర్మీ.. కారణమిదే..?
చైనా- భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తూర్పు లడాఖ్ మధ్య ఘర్షణతో టెన్షన్ టెన్షన్ గానే ఉంది. దీనికితోడు ఇరు దేశాల సైన్యం మొహరించే ఉంది. దీనిపై పలుమార్లు చర్చలు జరిగినా ఏకాభిప్రాయం రాలేదు. ఇప్పటికే రాఫెల్ యుద్ధవిమానాలను కూడా భారత్ కొనుగోలు చేసింది. తాజాగా 18 వేల కోట్లతో ఫైర్ పవర్ సామాగ్రి కొనుగోలు చేయబోతున్నారు. ఇందులో రూ.5 వేల కోట్లు అత్యవసర ఉపయోగం కోసం కొనుగోలు చేసిన ఐటెమ్స్ ఉన్నాయి.
ఆర్మీకి అవసరమైన సామాగ్రి కోసం 38 ఒప్పందాల్లో రూ.5 వేల కోట్ల వెచ్చించామని ఆర్మీ చీఫ్ నరవాణే తెలిపారు. వీటిలో ఆయుధాలు, ఇతర వస్తువులు కూడా ఉన్నాయని చెప్పారు. కఠినమైన శీతాకాలంలో దళాలకు అత్యవసరమైన వస్తువులు అవసరం అయ్యాయని చెప్పారు. దాడుల్లో చనిపోయిన సైనికుల కుటుంబాల కోసం ఫ్యామిలీ పెన్షన్ అందజేస్తున్నాని తెలిపారు. గాయపడ్డవారు/ చనిపోయిన వారి కుటుంబాలకు 'ఆపరేషన్ స్నో లియోపార్డ్' పేరుతో సాయం చేశామని చెప్పారు.
గతేడాది జూన్ 15వ తేదీన గాల్వాన్ వ్యాలీలో భారత్- చైనా భద్రతా దళాల మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. చైనా సైనికులు రాళ్లతో దాడిచేయడంతో కల్నల్ సహా 19 మంది సైనికులు చనిపోయారు. అప్పటినుంచి ఘర్షణ వాతావరణం నెలకొంది. శీతల పరిస్థితులు ఉండేందుకు గుడారాల్లో ఉండాల్సి వచ్చింది. మైనస్ 40 డిగ్రీల చలిలో పనిచేయాల్సి ఉంటుంది.