జవాన్లు, ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులు .. మేజర్ మృతి, నలుగురికి గాయాలు ..
శ్రీనగర్ : సరిహద్దులో పాపిస్థాన్ ఉగ్ర మూకలు రెచ్చిపోతున్నారు. యధేచ్చగా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్నారు. భారత జవాన్లు లక్ష్యంగా దాడికి తెగబడుతున్నారు. గతేడాది కన్నా ఈ ఏడాది కాల్పులు పెరిగాయని హోంశాఖ నివేదిక చెప్తుండగా .. ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. సైనికులే లక్ష్యంగా దాడి చేస్తున్నారు.
మేజర్ మృతి ..
కశ్మీర్లో ఉగ్రవాదులను ఎరివేసేందుకు సైనికుల ఇటీవల కార్డన్ సెర్చ్ చేపడుతున్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే పక్కా సమాచారంతో ఇవాళ ఉదయం అనంత్నాగ్ జిల్లాలో జవాన్లు జల్లెడ పడుతున్నారు. అచవల్ ఏరియాలో అణువణువును పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో భద్రతా బలగాల తనిఖీలతో ఉగ్రవాదులు అప్రమత్తమయ్యారు. ఓ ఇంట్లో నక్కిన టెర్రరిస్టులు జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. వారికి ధీటుగా భారత భద్రతా బలగాలు కూడా స్పందించాయి. ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఆర్మీ మేజర్ ర్యాంకు అధికారి ఒకరు చనిపోయారు. అధికారి ర్యాంకు గల మరో ఇద్దరు, ఇద్దరు జవాన్లు కాల్పుల్లో గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం 92 బేస్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి మెరుగ్గా ఉందని స్థానిక వైద్యులు తెలిపారు. వారికి చికిత్స అందించి డిశ్చార్జ్ చేస్తామని ఉద్ఘాటించారు. మరోవైపు మేజర్ పార్థీవదేహనికి పోస్టుమార్టం నిర్వహించి .. కుటుంబసభ్యులకు అప్పగిస్తామని ఆర్మీ అధికారులు తెలిపారు. సరిహద్దుల్లో కాల్పులను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని .. వారికి ఎప్పటికప్పుడు ధీటుగా సమాధానం చెప్తున్నామని ఆర్మీ వర్గాలు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.