ఫ్యామిలీతో రైలులో వెళుతున్న సైనికుడి దారుణ హత్య, భార్య ఆరా తీస్తే, మొబైల్ కోసం !
బెంగళూరు: భార్య కుమారుడితో కలిసి రైలులో ఊరికి వెలుతున్న సమయంలో దుండగులు సైనికుడిని దారుణంగా హత్య చేసిన ఘటన బెంగళూరు నగర శివార్లలో జరిగింది. ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న మాదేగౌడ (28) అనే సైనికుడు హత్యకు గురైనాడు. మాదేగౌడ భార్య దీపా ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు.
మాదేగౌడ ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. మాదేగౌడ ఆయన భార్య దీపా, నాలుగు సంవత్సరాల కుమారుడితో కలిసి ఉదయం 7.30 గంటల సమయంలో బెంగళూరు నుంచి కేరళ వెలుతున్న ఎక్స్ ప్రైస్ రైలులో మద్దూరుకు బయలుదేరాడు. భార్య, కుమారుడు రైలులో కుర్చున్న తరువాత మాదేగౌడ వాక్ రూం దగ్గరకు బయలుదేరాడు.
బెంగళూరు నగర శివార్లోలోని నాయుండనహళ్ళి దగ్గర రైలు వేగంగా వెలుతున్న సమయంలో వాక్ రూం దగ్గరకు బయలుదేరిన మాదేగౌడ ఎంతసేపటికి తిరిగిరాలేదు. ఆందోళనకు గురైన దీపా భర్త మాదేగౌడ కోసం రైలులో వెతకడం మొదలుపెట్టింది.
ఆ సమయంలో రైలు నుంచి ఓ వ్యక్తి కిందపడిన విషయం అదే రైల్లో ప్రయాణిస్తున్న వారు దీపాకు చెప్పారు. మరింత ఆందోళనకు గురైన దీపా భర్త మాదేగౌడ మొబైల్ కు ఫోన్ చేసింది. అయితే మాదేగౌడ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చింది.
పోలీసులు విచారణ చెయ్యగా దుండగులు మాదేగౌడ మొబైల్ లూటీ చెయ్యడానికి ప్రయత్నించారని, ఆ సమయంలో ఎదురు తిరిగిన మాదేగౌడను రైలు నుంచి కిందకు తోసి హత్య చేశారని వెలుగు చూసింది. దుండగుల కోసం గాలిస్తున్నామని బెంగళూరు రైల్వే పోలీసులు తెలిపారు.