భీకర ఎన్కౌంటర్: ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు మృతి, ముగ్గురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు జవాన్లు అమరులయ్యారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లు ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల చొరబాటును ప్రతిఘటిస్తుండగా ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
వివరాల్లోకి వెళితే.. మాచిల్ సెక్టార్ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి నుంచి ఎదురుకాల్పులు చోటు చేసుకుంటున్నాయి. శనివారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో కుప్వారా జిల్లాలోని ఎల్ఓసీ వద్ద ముష్కరులు అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నాన్ని భారత సైన్యం తిప్పికొట్టింది.
అనంతరం భద్రతా బలగాలు అక్కడ నిఘా పెంచాయి. కొద్ది సేపటికి భారీ సంఖ్యలో వచ్చిన ఉగ్రవాదులు భారత సైన్యంపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ ఆర్మీ అధికారితోపాటు ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. ఇక ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ మేరకు వివరాలను ఆర్మీ ప్రతినిధి కల్నల్ రాజేశ్ కాలియా తెలిపారు. కాగా, ఎల్ఓసీ వద్ద కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు చెప్పారు.
కాగా, సరిహద్దులో పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు చొరబడేందుకు గత కొంతకాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. మరోవైపు పాకిస్థాన్ సైనికులు కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి తరచూ తూట్లు పొడుస్తూనే ఉన్నాయి. అనేకమార్లు కాల్పులకు తెగబడుతున్నాయి. భారత దళాలు పాక్ ధీటుగా జవాబిస్తున్నాయి. పాక్ దాడులతో సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కుప్వారా ఎన్కౌంటర్లో తెలంగాణకు చెందిన జవాను మృతి
Recommended Video
కుప్వారాలో జరిగిన ఎదురుకాల్పుల్లో తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన మహేశ్ అనే జవాను మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు ధృవీకరించారు. ర్యాడా మహేశ్ స్వస్థలం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్పల్లి గ్రామం. మహేశ్ మరణవార్త విని ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.