సైన్యమా.. ఫేస్ బుక్కా- సోషల్ బ్యాన్ సవాల్ చేసిన లెఫ్టినెంట్ కల్నల్ కు ఢిల్లీ కోర్టు చీవాట్లు..
భారత్-చైనా సరిహద్దుల్లో ఘర్షణల నేపథ్యంలో ఈ మధ్య కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్మీలో పనిచేసే ఉద్యోగులెవరూ 89 సోషల్ మీడియా యాప్ లను వాడకూడదని నిషేధం విధించింది. దేశ భద్రతకు సంబంధించిన కీలక వివరాలు సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా శత్రు దేశాలు హ్యాక్ చేసే అవకాశముందని భావించడం వల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై దేశవ్యాప్తంగా సానుకూల స్పందన వ్యక్తమైంది. సైన్యంలోనూ దీనిపై మంచి స్పందనే వచ్చింది. కానీ ఓ లెఫ్టినెంట్ కల్నల్ మాత్రం కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు.
ఢిల్లీ కోర్టు విచారణ...
కేంద్ర ప్రభుత్వం తాజాగా సైన్యంలో పనిచేసే ఉద్యోగులు సోషల్ మీడియా యాప్ లు వాడకుండా విధించిన నిషేధం నుంచి తనకు మినహాయింపులు ఇవ్వాలంటూ లెఫ్టినెంట్ పీకే చౌదరి ఢిల్లీ స్ధానిక కోర్టును ఆశ్రయించారు. కేంద్రం ఆదేశాల ప్రకారం ఫేస్ బుక్ అకౌంట్ డిలీట్ చేస్తే తాను ఇప్పటివరకూ దాచుకున్న జ్ఞాపకాలు, ఇతర సమాచారాన్ని కోల్పోతానని, అది తిరిగి వెనక్కి తీసుకునే వీలుండదని వాదించారు. ఫేస్ బుక్ అకౌంట్ లో తన ఫ్రెండ్స్ తో పాటు సమాచారాన్ని కూడా శాశ్వతంగా కోల్పోయే అవకాశం ఉన్నందున తనకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. దీనిపై న్యాయస్ధానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కోర్టు అక్షింతలు...
కేంద్ర నిర్ణయంపై లెఫ్టినెంట్ కల్నల్ పీకే చౌదరి వాదన విన్న ఢిల్లీ కోర్టు.. మీరు కొత్తగా ఎప్పుడైనా తిరిగి ఫేస్ బుక్ అకౌంట్ తెరిచే అవకాశం ఉంటుందని, గతంలోలా దానిని వాడుకునేందుకు ఎలాంటి అభ్యంతరాలు ఉండబోవని చెప్పింది. కానీ కల్నల్ తరఫు న్యాయవాది పదే పదే కోరడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ దేశ సైనిక అధికారిగా దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఆదేశాల ప్రకారం సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. భద్రతపై ఆందోళనలు చెలరేగుతున్న తరుణంలో ఇలాంటి మినహాయింపుల వల్ల సమస్యలు తప్పవని గుర్తుచేసింది. అప్పటికీ న్యాయవాది వాదనలు కొనసాగించడంతో కోర్టు తీవ్రంగా స్పందించింది.
Recommended Video
సైన్యం కావాలా...ఫేస్ బుక్ కావాలా..
ఈ సమయంలో కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ వాదనలు వినిపించారు. సోషల్ మీడియా యాప్ ఫేస్ బుక్ లో తాజాగా ఓ బగ్ ను కనుగొన్నామని, అది సైబర్ యుద్దంలో వాడేదిలా ఉందని కోర్టుకు వివరించారు. దీనిపై స్పందించిన కోర్టు...సైన్యం కావాలా ఫేస్ బుక్ కావాలో తేల్చుకోవాలని లెఫ్టినెంట్ కల్నల్ చౌదరికి సూచించింది. ఒకవేళ ఫేస్ బుక్ మాత్రమే కావాలనుకుంటే ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లి ఫేస్ బుక్ అకౌంట్ కొనసాగించుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. చివరికి సైన్యంలో ఉద్యోగ విధానాలను పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం వెలువరిస్తామని కేసును ఈ నెల 21కు వాయిదా వేసింది.