పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అబద్దం చెప్పారు: ఇండియన్ ఆర్మీ
న్యూఢిల్లీ: భారత్ - పాక్ సరిహద్దుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకు 40 మంది భారత సైనికులు మృతి చెందారని, సోమవారం ఒక్క రోజే 11 మంది జవాన్లు మృతి చెందారని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ చేసిన ప్రకటనను భారత ఆర్మీ తోసిపుచ్చింది.
అది పూర్తి అవాస్తవమని పేర్కొంది. పాకిస్తాన్ జరిపిన కాల్పులలో భారత సైనికులు ఎవరూ మృతి చెందలేదని ఆర్మీ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ నెల 14, 15, 16 తేదీల్లో పాక్ జరిపిన ఎదురుకాల్పుల్లో భారత జవాన్లకు ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపింది.
పాకిస్థాన్లోని పంజాబ్ సరిహద్దులో పాక్ ఆర్మీ పెద్ద ఎత్తున చేపట్టిన సైనిక విన్యాసాల కార్యక్రమానికి ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ హాజరయ్యారు. ఎల్వోసీ వద్ద జరిగిన కాల్పుల్లో సోమవారం 11 మంది సైనికులతో సహా ఇప్పటి వరకు 40 మంది సైనికులు మృతి చెందారని ఆయన అన్నారు. అయితే ఆయన చెప్పినదాంట్లో వాస్తవం లేదని భారత సైన్యం ఖండించింది.