Coronavirus: సైన్యం ఆధీనంలో: చైనా నుంచి వచ్చే భారతీయుల కోసం వైద్య శిబిరాలు: నెగెటివ్ వస్తేనే..!
Recommended Video
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన చైనా నుంచి స్వదేశానికి తరలి వస్తోన్న ప్రవాస భారతీయుల కోసం సైన్యాధికారులు ప్రత్యేకంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. చైనా నుంచి వచ్చిన వెంటనే వారందరినీ ఈ వైద్య శిబిరానికి తరలిస్తారు. సమగ్రంగా వైద్య పరీక్షలను నిర్వహిస్తారు. ఆర్మీ పర్యవేక్షణలో కొనసాగుతుందీ శిబిరం. కరోనా వైరస్ సోకలేదనే విషయం నిర్ధారణ అయిన తరువాతే.. వారిని స్వస్థలాలకు వెళ్లడానికి అనుమతి ఇస్తామని సైన్యాధికారులు వెల్లడించారు.
Coronavirus: ఎయిర్ లిఫ్టింగ్: భారతీయుల తరలింపు షురూ: ఎయిరిండియా జంబో ఫ్లైట్..!
చైనాలోని హ్యూబె ప్రావిన్స్ వూహాన్ సిటీలో నివసిస్తోన్న ప్రవాస భారతీయులు, విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకుని రావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ విమానాన్ని పంపించిన విషయం తెలిసిందే. ఎయిరిండియా జంబో ఫ్లైట్ శుక్రవారం మధ్యాహ్నం దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వుహాన్ సిటీకి బయలుదేరి వెళ్లింది. తొలిదశలో 315 మందిని స్వదేశానికి తీసుకుని రానుందా విమానం.
అలా వచ్చిన వారిని వెంటనే తమ స్వస్థలాలకు వెళ్లడానికి అనుమతి ఇవ్వరు అధికారులు. వారిని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా- మనేసర్లో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరానికి తరలిస్తారు. 300 బెడ్లను ఈ శిబిరంలో అందుబాటులో ఉంచారు. 300 మంది లేదా అంతకంటే ఎక్కువ మందికి ఏకకాలంలో వైద్య చికిత్స అందించడానికి అనువుగా దీన్ని తీర్చిదిద్దారు. సైన్యానికి చెందిన డాక్టర్లు, అఖిల భారత వైద్య విజ్ఙాన సంస్థ (ఎయిమ్స్) వైద్యుల పర్యవేక్షణలో వారికి ఈ పరీక్షలు కొనసాగుతాయి.
వారం రోజుల పాటు ఈ వైద్య శిబిరాలను కొనసాగిస్తామని సైనిక ప్రతినిధులు వెల్లడించారు. చైనా నుంచి తొలిదశలో వచ్చే 315 మందితో పాటు రెండో విడత రానున్న భారతీయుల కోసం ఈ శిబిరాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు. చైనా నుంచి స్వదేశానికి వచ్చే ప్రతి ఒక్క భారత పౌరుడికీ ఈ వైద్య శిబిరంలోనే పరీక్షలు కొనసాగుతాయని చెప్పారు. నెగెటివ్గా తేలిన తరువాతే స్వస్థలాలకు పంపిస్తామని అన్నారు.