చైనా బలగాల ఉపసంహరణ లేనట్లే ? లడఖ్లో భారత సైనికుల కోసం నివాసాల ఏర్పాటు
భారత్, చైనా మధ్య తాజాగా బలగాల ఉపసంహరణ కోసం కుదిరిన ఒప్పందం అమలు చేసేందుకు పొరుగుదేశం సిద్ధం కావడం లేదు. అసలే చలికాలంలో ప్రతికూల వాతావరణ పరిస్ధితుల మధ్య ఈ సీజన్లో సరిహద్దుల్లో బలగాల కాపలా కాయడం కూడా అసాధ్యం. దీంతో బలగాల ఉపసంహరణకు చైనా చేసిన ప్రతిపాదనకు భారత్ అంగీకారం తెలిపింది. అయినా చైనా నుంచి ఎటువంటి ఉపసంహరణ సంకేతాలు లేకపోవడంతో భారత సైన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు దిగుతోంది.
తాజాగా సైన్యం విడుదల చేసిన ఓ వీడియోలో లడఖ్లో భారత బలగాల కోసం తాత్కాలిక నివాస సముదాయాలు, అందులో మంచాలు, కప్బోర్డులు, హీటర్లు కూడా కనిపించాయి. కొన్ని చోట్ల సింగిల్ రూమ్లు కూడా ఉన్నాయి. లివింగ్ రూమ్ల్లో బంక్ బెడ్లను ఏర్పాటు చేశారు.
ఇన్నేళ్లుగా భారత సైన్యం ఈ ప్రాంతంలో బలగాల కోసం కొన్ని తాత్కాలిక ఏర్పాట్లు మాత్రం చేస్తుండగా.. ఈసారి చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో అత్యుత్తమ నాణ్యతతో కూడిన నివాస ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో విద్యుత్ సరఫరాతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకునే పలు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సీజన్లో లడఖ్లో ఉష్ణోగ్రతలు మైనస్ 30 డిగ్రీలకు పడిపోతుంటాయి. అలాగే 40 అడుగుల ఎత్తులో మంచు పేరుకుపోతుంటుంది. దీంతో బలగాలు ఎటువంటి ప్రతికూల పరిస్ధితులను అయినా ఎదుర్కొనేందుకు వీలుగా ఈ నివాసాలను ఏర్పాటు చేసినట్లు ఆర్మీ ప్రకటించింది. వీటి కోసం రష్యా నుంచి ప్రత్యేక టెంట్లను కూడా కాన్పూర్ లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ద్వారా తెప్పించారు. వీటికి సైబీరియా వంటి ప్రపంచంలోనే అత్యంత చల్లనైన ప్రాంతాల్లో వాతావరణాన్ని కూడా ఎదుర్కొనే సత్తా ఉందని అధికారులు చెప్తున్నారు.
#WATCH Eastern Ladakh: In order to ensure operational efficiency of troops deployed in winters, Indian Army has completed establishment of habitat facilities for all troops deployed in the sector. pic.twitter.com/H6Sm5VG541
— ANI (@ANI) November 18, 2020