అర్నాబ్ గోస్వామికి బీజేపీ సుపారి -అన్వయ్ నాయక్ భూమిపుత్రుడు -సామ్నాలో శివసేన ఫైర్
మహారాష్ట్రకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముద్ నాయక్ ల ఆత్మహత్య కేసులో ప్రముఖ జర్నలిస్టు, రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామిని అరెస్టు చేయడంపై రాజకీయ దుమారం కొనసాగుతున్నది. గోస్వామి అరెస్టుకు నిరసనగా శుక్రవారం ముంబైలోని మహారాష్ట్ర సచివాలయం వద్ద ఆందోళన చేపట్టిన బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్, మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్నాబ్ కు బీజేపీ బాహాటంగా మద్దతు పలుకుతుండటంపై శివసేన తీవ్ర స్థాయిలో ఫైరైంది.
అర్నాబ్ అరెస్టు, అనంతర పరిణామాలపై శివసేన ఆధ్వర్యంలో నడిచే 'సామ్నా' దినపత్రిక తాజా ఎడిటోరియల్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఈ పత్రికకు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఎడిటర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అర్నాబ్ ఓ చవకబారు జర్నలిస్టని, బీజేపీ నుంచి సుపారి తీసుకుని పనిచేస్తాడని, అతని డ్రామాలను సహించాల్సిన అవసరం ప్రజాప్రభుత్వాలు లేదని సామ్నాలో శివసేన మండిపడింది. భూమిపుత్రుడైన అన్వయ్ నాయక్ ఆత్మహత్యను మహారాష్ట్ర బీజేపీ నేతలు కూడా ఖండిచాలని సామ్నా డిమాండ్ చేసింది.
''ఆర్నాబ్ అరెస్టుతో మహారాష్ట్ర పాలక కూటమికి ఎలాంటి సంబంధం లేదు. ఆత్మహత్య కేసుకు సంబంధించి ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు సైతం ఆయనను రిమాండ్ కు పంపింది. అర్నాబ్ అరెస్టుతో పత్రికాస్వేఛ్చకు విఘాతం కలిగిందని బీజేపీ బీరాలు పోవడం విడ్డూరంగా ఉంది. దీన్ని ఎమర్జెన్సీతో పోల్చడం మరీ విచిత్రంగా ఉ:ది. అర్నాబ్ నేరం చేశానడానికి ఆధారాలున్నాయి. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిస్కారణంగా ఎంతో మంది జర్నలిస్టుల్ని అరెస్టులు చేస్తున్నారు. ఆ ఘటనలు ఎమర్జెన్సీ కిందికి రావా?'' అని బీజేపీపై శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆర్కిటెక్చర్-ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముద్ నాయక్ల ఆత్మహత్య కేసులో అర్నాబ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కాగా, ఆయనను వెంటనే విడుదల చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో పలు చోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి.