ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య, భార్య ఫిర్యాదు,: అర్నాబ్ గోస్వామిపై ఎఫ్ఐఆర్!
ముంబై: ముంబైలోని అలీబాగ్ పోలీస్ స్టేషన్లో రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నాబ్ గోస్వామిపై కేసు నమోదయింది. అర్నాబ్ తనకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో కలత చెందిన ఇంటీరియర్ డిజైనర్ అన్వాయ్ నాయక్ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.
ఈ మేరకు అర్నాబ్ తనకు చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వకపోవడంతో కలత చెందినట్లు ఆయన పేర్కొన్నాడని తెలిస్తోంది. తన నివాసంలో అన్వాయ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని వద్ద లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా ఆయన భార్య అక్షత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆత్మహత్యకు ప్రేరేపించేవారనే ఆరోపణలతో అర్నాబ్ గోస్వామితో పాటు మరో ఇద్దరు.. ఫిరోజ్ షేక్, నితీష్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఎస్పీ తెలిపారు.
రిపబ్లిక్ టీవీ నుంచి తమకు రావాల్సిన బకాయి రాకపోవడంతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని అక్షత ఫిర్యాదులో ఆరోపించినట్టు చెప్పారు. పోస్ట్ మార్గం నివేదిక వచ్చిన తర్వాత నిందితులపై చర్యలు చేపడతామన్నారు.
ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. కాగా, ఈ ఆరోపణలను రిపబ్లిక్ టీవీ ప్రతినిధులు ఖండించారు. అతనికి చెల్లించాల్సిన బకాయిలను వాయిదా పద్ధతిలో మొత్తం చెల్లించామని, ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు.