అర్నబ్ గోస్వామి, కంగనా రనౌత్లకు వ్యతిరేకంగా మహారాష్ట్ర సభల్లో ప్రివిలేజ్ మోషన్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల రెండో రోజైన మంగళవారం అధికార శివసేన.. రిపబ్లిక్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్, ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామికి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ పెట్టారు. దీంతోపాటు బాలీవుడ్ నటి కంగనా రనౌత్పై శాసనమండలిలో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే)తో ముంబైని పోల్చడంపై ఆమెపై ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్లపై అర్నబ్ గోస్వామి అవమానకర భాషను ఉపయోగించారంటూ, ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తున్నారంటూ శివసనే ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ అసెంబ్లీలో ఆయనపై ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారు. అంతేగాక, సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు విషయమై మంత్రులు, లోక్సభ, రాజ్యసభ సభ్యులను టీవీ డిబేట్లలో తరచుగా అవమానపరుస్తున్నారంటూ మండిపడ్డారు.
'మీడియా స్వతంత్ర పేరిట, అతను ముఖ్యమంత్రి, పవార్ సాహెబ్, ఇతర ఎన్నికైన ప్రతినిధులను దుర్భాషలాడుతున్నారు. మేము దీనిని ఖండిస్తున్నాము, కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం' అని శివసేన ఎమ్మెల్యే అన్నారు.ప్రతిపక్ష బీజేపీ సభ్యులు దీన్ని వ్యతిరేకించినప్పటికీ.. పార్లమెంటరీ ఎఫైర్స్ మంత్రి ప్రరబ్ ఈ మోషన్ను అంగీకరించాలని స్పీకర్ను కోరారు. ప్రధానమంత్రిపై విమర్శుల చేస్తే తప్పుబడతారు.. సీఎంపై విమర్శలు చేస్తే తప్పుకాదా? అని ప్రతిపక్షాన్ని ఆయన ప్రశ్నించారు.
ఎన్సీపీ లీడర్ ఛగన్ భుజ్బల్, సమాజ్వాదీ పార్టీ అబూ ఆజ్మీ కూడా ఈ మోషన్కు మద్దతు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తమ అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉందని బీజేపీ వ్యాఖ్యానించింది. అయితే, దానికి కొంత పరిమితి ఉంటుందని చెప్పింది. లేజిస్లేటివ్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామని డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ తెలిపారు. కానీ, హోంమంత్రి దీనిపై ప్రకటన చేయాలని సభ్యుడు సర్నాయక్ పట్టుబట్టారు.
కరోనా మహమ్మారితోపాటు రాష్ట్రంలో అనేక సమస్యలున్నప్పటికీ శాసనసభ సమయాన్ని అనవసర విషయాల కోసం వృథా చేశారని ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ మండిపడ్డారు. మీడియా స్వతంత్రంపై మహారాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని ధ్వజెమత్తారు. తమకు అనుకూలంగా ఉండే మీడియా ఏం చేసినా స్వాగతిస్తున్నారని మండిపడ్డారు. అర్నబ్ గోస్వామికి వ్యతిరేకంగా మోషన్ మూవ్ చేయడాన్ని బీజేపీ సభ్యులు వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో మూడుసార్లు సభ వాయిదా పడింది.
శాసనభలో పెట్టిన మోషన్ ఆమోదం పొందిందని, తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని శివసేన ఎమ్మెల్యే సర్నాయక్ తెలిపారు. ఇక శాసనమండిలో కంగనా రనౌత్పై ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారు. ముంబై పోలీసులపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు పోలీసులకే కాదు రాష్ట్రానికే అవమానకరమని అన్నారు. కాగా, కంగనా రనౌత్కు వ్యతిరేకంగా మూవ్ చేసిన ప్రివిలేజ్ మోషన్ ను అంగీకరిస్తున్నట్లు లేజిస్లేటివ్ కౌన్సిల్ ఛైర్మన్ రాంరాజే నాయక్ నింబాల్కర్ వెల్లడించారు.