మహరాష్ట్ర రైతుల లాంగ్ మార్చ్: అసెంబ్లీ ముట్టడికి సై, ఎందుకంటే?
Recommended Video
ముంబై: మహరాష్ట్రలో రైతులు లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు. మహరాష్ట్ర విధానసభ(అసెంబ్లీ)ని మార్చి 12, ముట్టడించనున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రైతులు 180 కి.మీ. పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. వేలాది మంది రైతులు ముంబైలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు. మహరాష్ట్ర రైతలు లాంగ్ మార్చ్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మహరాష్ట్రలో రైతులు లాంగ్ మార్చ్ ఆ రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలకు అద్దం పడుతోంది.తమ సమస్యలను పరిష్కరించాలని రైతులు పెద్ద సంఖ్యలో అసెంబ్లీని ముట్టడించేందుకు బయలు దేరారు.
180 కి.మీ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ముంబై శివార్లకు పాదయాత్ర చేరుకొంది. మార్చి 12న, పాదయాత్రగా బయలుదేరిన రైతులు అసెంబ్లీని ముట్టడించనున్నారు.
రైతుల లాంగ్ మార్చ్ ఎందుకు
మహరాష్ట్రలో ప్రకృతి వైపరీత్యాలు, ఇతరత్రా సమస్యలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తమను ఆదుకొంటామని హమీ ఇచ్చిన ప్రభుత్వం ఆచరణలో మాత్రం రైతులకు స్వాంతన చేకూర్చే ప్రయత్నం చేయలేదనేది రైతుల అసంతృప్తి. దీంతో రైతులు లాంగ్ మార్చ్కు శ్రీకారం చుట్టారు. మహరాష్ట్రలోని నాసిక్ నుండి ముంబైల్ విధానసనభను ముట్టడించేందుకు ర్యాలీగా బయలుదేరారు. వడగండ్ల వర్షాలు, ప్రకృతి విపత్తులు తీవ్రంగా నష్టపర్చాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. . పింక్ బాల్ వార్మ్ పత్తి రైతుల్ని పీల్చిపిప్పి చేసింది. ఫిబ్రవరిలో కురిసిన వడగళ్లవానలకు లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మొత్తం 19 జిల్లాల్లో రబీ పంట తుడిచిపెట్టుకుపోయింది. దీంతో రైతులు రొడ్డెక్కారు.
రుణమాపీ కోసం రైతుల డిమాండ్
తీవ్రంగా నష్టపోయిన రైతులు రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గతంలో మహరాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది మహారాష్ట్ర సర్కార్ 34 వేల కోట్ల రైతు రుణాల మాఫీకి హామీ ఇచ్చింది. కానీ అమలు సరిగా జరగలేదు. దీంతో అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ సమస్యల తీరేవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నదాతలు హెచ్చరిస్తున్నారు.
కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యలు
రైతు సమస్యల పరిష్కారానికి గత ఏడాది ప్రభుత్వం రుణ మాఫీని ప్రకటించినా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. క్షేత్రస్థాయిలో దీని అమలు జరగలేదని రైతులు చెబుతున్నారు. దీంతో అన్నదాతల ఆత్మహత్యలు ఆగలేదు. గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 1753 మంది రైతన్నలు బలవన్మరణానికి పాల్పడ్డారు. విదర్భ, మరఠ్వాడ, నాసిక్ ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. దీంతో రైతులు తమకు న్యాయం చేయాలని రోడ్డెక్కారు.
సహయం చేస్తామన్న సర్కార్
రైతాంగాన్ని ఆదుకొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నామని మహరాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. 35 లక్షల 68 వేల మంది రైతులకు లబ్ధి చేకూరేలా రుణమాఫీ పథకం కింద ఇప్పటివరకు 13, 782 కోట్లు నిధులు విడుదల చేశామని చెబుతోంది. అయితే క్షేత్రస్థాయిలో ఈ పథకం అమల్లో ఆశించినట్టుగా సాగలేదు.దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో వ్యవసాయ రంగానికే అత్యంత ప్రాధాన్యతనిస్తూ 15వేల కోట్ల రూపాయలను కేటాయించారు. రైతు సమస్యల పరిష్కారానికి కేంద్రం నుంచి 2,400 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా ప్రభుత్వం కోరింది.