ఆర్టికల్ 370 వల్ల సుమారు 42వేల మంది ప్రాణాలు కోల్పోయారు.. అమిత్ షా
జమ్ము కశ్మీర్ విభజన బిల్లుపై రాజ్యసభలో వాడివాడిగా చర్చలు జరిగాయి. ఆందోళనల మధ్య విభజన బిల్లును ప్రవేశపెట్టిన అమిత్ షా ప్రతిపక్షాలు లేవనెత్తిన పలు సందేహాలకు ఆయన సమాధానం చేప్పారు. ఈనేపథ్యంలోనే కశ్మీర్ లోయలో జరిగే హింసతో ఉపాధి అవకాశాలపై ఆయన వివరించారు. ఆర్టికల్ 370 వల్ల లోయలో సుమారు 40వేల మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. దాని నష్టం గురించి ప్రజలకు వివరించడంతో అక్కడి పార్టీలు వైఫల్యం చెందిదని అన్నారు.
కశ్మీర్ను తిరిగి రాష్ట్రంగా మారుస్తాం...
కశ్మీర్ను దేశంలో సంపూర్ణంగా ఐక్యం చేయడం, రక్తపాతం, ఉగ్రవాదానికి తావు లేని ప్రశాంత ప్రాంతంగా చూడటమే తమ లక్ష్యమని, అందులో భాగంగానే జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో స్పష్టం చేశారు. రానున్న ఐదేళ్లలో కశ్మీర్లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని, సాధారణ పరిస్థితులు పునరుద్ధరించిన అనంతరం జమ్మూకశ్మీర్కు తిరిగి రాష్ట్ర హోదా ఇస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. ఎక్కువకాలం జమ్మూకశ్మీర్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చూడాలనుకోవడం లేదన్నారు.
ఆర్టికల్ 370 వల్ల 40వేలకు పైగా మృతి చెందారు
ఆర్టికల్ 370 వల్ల కాశ్మీరీ యువత ఉగ్రవాదంవైపు వెళ్లిపోతోందన్నారు. 1990 నుంచి 2018 వరకు కాశ్మీర్లో 41,894 మంది యువత ప్రాణాలు కోల్పోయారని అమిత్ షా చెప్పారు. ఆర్టికల్ 370ని వెనకేసుకు వచ్చేవారి పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారో చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు. కాశ్మీర్ వ్యాలీలో యువతకు కూడా ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేసిందన్నారు.
కశ్మీర్లో అవినీతిని ప్రశ్నించే అధికారం ఎవ్వరికి లేదు...
కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల నిధులను జమ్మూకాశ్మీర్కు పంపినా.. అక్కడ భారీ ఎత్తున అవకతవకలు జరిగాయన్నారు. అయితే, వాటిపై విచారణ చేసే దర్యాప్తు సంస్థలకు ప్రవేశం లేనందున అవినీతిని అంతం చేసే అవకాశం లేకపోయిందన్నారు. కాశ్మీర్ వ్యాలీ పర్యాటకం గురించి ప్రపంచం మొత్తం తెలుసన్నారు. అయితే, అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టి ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశం లేకపోయిందన్నారు. ఆర్టికల్ 370 వల్ల స్టార్ హోటల్ లాంటివి ఏర్పాటు కాలేదన్నారు. జమ్మూకాశ్మీర్లో ఎవరైనా పారిశ్రామిక వేత్త పెద్ద ఇండస్ట్రీని పెట్టాలనుకుంటే కూడా ఈ నిబంధన అడ్డుగా ఉందన్నారు.
ఉమ్మడి ఆంధ్రపదేశ్ను ఎలా విభజించారో అందరికి తెలుసు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు ఎలా విభజించిందో అందరికీ తెలుసునని, తలుపులు మూసి, లైవ్ ప్రసారాన్ని నిలిపేసి నాడు సభలో విభజన బిల్లును ఆమోదింపజేశారని తప్పుబట్టారు. కానీ, కశ్మీర్ విషయంలో తాము అలా చేయడం లేదని, ఈ బిల్లుపై అభ్యంతరాలు చెప్పుకోవడానికి ప్రతిపక్ష సభ్యులకు అవకాశమిచ్చామని తెలిపారు.అయితే అమిత్ షా వ్యాఖ్యలపై గులాంనభి అజాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనలో సంవత్సరం పాటు సంప్రదింపులు జరిపామని అనంతరమే పార్లమెంట్లో బిల్లును తీసుకువచ్చామని అన్నారు.