జైల్లోనే చోటా రాజన్ హత్యకు కుట్ర, దావూద్ తరహలోనే గ్యాంగ్ కు జునైద్ ప్లాన్
తీహర్ జైల్లో ఉన్న గ్యాంగ్ స్టర్ చోటా రాజన్ ను హత్యచేసేందుకు అండర్ వరల్డ్ డాన్ దావూర్ ఇబ్రహీం అనుచరుడు చోటా షకీల్ గ్యాంగ్ పన్నిన కుట్రను పోలీసులు చేధించారు.
న్యూఢిల్లీ: తీహర్ జైల్లో ఉన్న గ్యాంగ్ స్టర్ చోటా రాజన్ ను హత్యచేసేందుకు అండర్ వరల్డ్ డాన్ దావూర్ ఇబ్రహీం అనుచరుడు చోటా షకీల్ గ్యాంగ్ పన్నిన కుట్రను పోలీసులు చేధించారు.
చోటా షకీల్ గ్యాంగ్ సభ్యుడు జునైద్ చౌదరిని ఈశాన్య ఢిల్లిలోని వజీరాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు. 21 ఏళ్ళ జునైద్ చౌదరి ఇండియా మోస్ట్ వాంటెడ్. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం లా టాప్ గ్యాంగ్ స్టర్ కావాలనుకొన్నాడని పోలీసుల విచారణలో తేలింది.
పాకిస్తాన్ లో జన్మించి కెనెడియన్ రచయితగా స్థిరపడ్డ తారెక్ ఫతా హత్యకు కుట్రపన్ని జునైద్ చౌదరి పోలీసులకు చిక్కాడు. అయితే ఈ హత్యతోనే మరో హత్యకు కుట్రపన్నాడు జునైద్.
ఇప్పటికే గత ఏడాది చోటా రాజన్ ను కోర్టుకు తీసుకెళ్ళే సమయంలో చంపాలని జునైద్ పథకం రచించి విఫలమైన విషయం తెలిసిందే. రాజన్ ను చంపేందుకు జునైద్ తో పాటు నలుగురు కాంట్రాక్ట్ కిల్లర్లు రాబిన్సన్, యూనిస్, మనీష్ లను పోలీసులు అరెస్టు చేశారు.
అయితే ఈ ఏడాది మాత్రం ముందుగా ఫతాను హతమార్చి పోలీసులకు చిక్కితే నేరుగా తీహార్ జైలుకు వెళ్ళొచ్చని స్కెచ్ వేశాడు. దీంతో జైళ్ళోనే చోటా రాజన్ ను హతమార్చొచ్చని ప్లాన్ వేశాడు.
టెర్రరిజాన్ని ఖండిస్తూ ఫతా పలుమార్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో ఫతాని అంతమొందించాలని జునైద్ భావించాడని స్పెషల్ బ్రాంచ్ డీసీపీ పీఎస్ కుష్ వా తెలిపారు.
ఫతా ఢిల్లీ రానున్న నేపథ్యంలో జునైద్ రెక్కీ నిర్వహిస్తూ పోలీసులకు చిక్కాడు. ఈశాన్య ఢిల్లీలోని గోకాల్ పురీ ప్రాంతంలోని భాగీరథి విహార్ కు చెందిన ఓ పాల వ్యాపారి కుమారుడు జునైద్.