కశ్మీర్ నాయకులు లేని లోటును ఉగ్రవాదులతో పూడుస్తారా.. కేంద్రంపై రాహుల్ విమర్శలు
న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్ రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సందర్భంగా రాజకీయ నేతల అరెస్ట్ను విపక్షాలు తప్పుపడుతున్నాయి. ఇప్పటికే టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ తప్పుపట్టగా .. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా స్వరం కలిపారు. వారు రాజకీయ నేతలా ఉగ్రవాదులా అని ప్రశ్నించారు రాహుల్. జమ్ము కశ్మీర్ రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే సమయంలో .. స్థానిక నేతలను అదుపులోకి తీసుకోవాలా ? అని ప్రశ్నించారు. మోడీ, అమిత్ షా ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని మండిపడ్డారు.
కశ్మీర్ మాజీ సీఎంలు మెహబూబ ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా అరెస్ట్ మూర్ఖపు చర్యగా అభివర్ణించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కశ్మీర్లో నేతలను అరెస్ట్ చేసి ఎలాంటి సంకేతాలు ఇద్దామనుకుంటున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో నాయకులు లేని లోటును ఉగ్రవాదులతో పూడుస్తారా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముప్తీ, ఒమర్ను అరెస్ట్ చేసి రహస్య ప్రాంతానికి తీసుకెళ్లడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేశాక ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని ఒమర్ అబ్దుల్లా, మెహబూబ ముఫ్తీని గృహ నిర్భందంలో ఉంచారు. జమ్ము కశ్మీర్ విభజన బిల్లును రాజ్యసభ ఆమోదం తెలుపడంతో రాత్రి వారిని అదుపులోకి తీసుకొని రహస్య ప్రాంతానికి తరలించారు.
నేతల అరెస్ట్ను టీఎంసీ అధినాయకురాలు మమతా బెనర్జీ తప్పుపట్టారు. ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబ ముఫ్తీ అరెస్ట్కు సంబంధించి తన వద్ద సమాచారం లేదని .. కానీ వారిని బంధించడం మాత్రం సరికాదన్నారు. వారు రాజకీయ పార్టీ నేతలే తప్ప ఉగ్రవాదులు కాదని హితవు పలికారు. ఒకవేళ వారిని కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసే వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని .. అదుపులోకి తీసుకుని వ్యవస్థలను మ్యానేజ్ చేయలేరని తేల్చిచెప్పారు.