భగ్గుమన్న విద్యార్థులు: 'మౌనిక' ఆత్మహత్య, సత్యభామ వర్సిటీలో విధ్వంసం, అసలేం జరిగింది?..
బుధవారం రాత్రి వర్సిటీ ఫర్నీచర్ ధ్వంసం చేయడంతో బస్సులకు నిప్పు పెట్టారు.
Recommended Video
చెన్నై: చెన్నై శివారులోని సత్యభామ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న దువ్వూరు రాగమౌనిక రెడ్డి అనే తెలుగు విద్యార్థిని బుధవారం ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ గదిలో ఉరివేసుకుని అఘాయిత్యానికి పాల్పడింది.
రాగమౌనిక ఆత్మహత్య వెనుక యాజమాన్యంపై ఆరోపణలు రావడంతో వర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. బుధవారం రాత్రి వర్సిటీ ఫర్నీచర్ ధ్వంసం చేయడంతో బస్సులకు నిప్పు పెట్టారు. దీంతో వర్సిటీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అసలేం జరిగింది?:
సోమవారం జరిగిన కెమిస్ట్రీ ఇంటర్నల్ పరీక్షల్లో రాగమౌనిక కాపీకి పాల్పడిందని యాజమాన్యం చెబుతోంది. ఆ కారణంగానే మంగళవారం కూడా ఆమెను పరీక్షకు అనుమతించలేదు. అందరి ముందే పరీక్ష హాల్ నుంచి ఆమెను బయటకి పంపించేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది.
హాస్టల్ గదిలో ఆత్మహత్య:
సత్యభామ యూనివర్సిటీలో రాగమౌనిక కంప్యూటర్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. కాపీ కొట్టిందన్న కారణంతో పరీక్షలకు అనుమతించకపోవడంతో తిరిగి హాస్టల్ గదికి వెళ్లిపోయింది. గదిలో రాగమౌనిక ఒక్కరే ఉండటం.. తీవ్ర మనస్తాపం చెంది ఉండటంతో ఆత్మహత్యకు పాల్పడింది.
చనిపోయే ముందు మెసేజ్:
పరీక్ష హాల్లో అందరి ముందే తనను బయటకు పంపించడంతో రాగమౌనిక దాన్ని అవమానంగా భావించింది. ఆత్మహత్యకు ముందు ' మిస్ యూ ఆల్, లవ్ యూ ఆల్' అంటూ మెసేజ్ పెట్టి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు సోదరుడితో వీడియో కాల్ మాట్లాడటంతో.. వెంటనే అతను యూనివర్సిటీ హాస్టల్ వద్దకు వచ్చినట్టు తెలుస్తోంది.
హుటాహుటిన వచ్చినప్పటికీ:
హుటాహుటిన అతను వర్సిటీ హాస్టల్ వద్దకు వచ్చినప్పటికీ.. సెక్యూరిటీ అతన్ని అడ్డుకోవడంతో తన చెల్లెలిని కోల్పోవాల్సి వచ్చింది. ఎంతగా బతిమాలినా సెక్యూరిటీ అతన్ని లోపలికి పంపించకపోవడంతో ఆమె అఘాయిత్యాన్ని అడ్డుకునే అవకాశం లేకుండా పోయింది.
ఈ ఘటనపై తెలుగు విద్యార్థులంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ దీనికి నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫర్నీచర్ ధ్వంసం చేయడంతో పాటు కాలేజీ బస్సులకు నిప్పు పెట్టారు. మంటలు ఎగసిపడటంతో ఫైరింజన్ సిబ్బంది రంగంలోకి దిగారు. తెలుగు విద్యార్థులకు తమిళ విద్యార్థులు కూడా మద్దతు తెలపడంతో మరింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.