జయ ఓటర్లు: హారతి, పూల వర్షంకు నగదు ప్యాకేజీలు, ఏమంటే సాంప్రదాయం!
చెన్నై: జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 12వ తేదీన జరగనుంది. అదేరోజు ఆర్ కే నగర్ లో పోటీ చేస్తున్న అభ్యర్థుల జాతకాలను స్థానిక ఓటర్లు నిర్ణయించనున్నారు.
తమిళనాడులో అధికారంలో ఉన్న శశికళ వర్గం నుంచి టీటీవీ దినకరన్ పోటీ చేస్తున్నారు. అన్నాడీఎంకే పార్టీ రెబల్ నాయకుడు పన్నీర్ సెల్వం వర్గం నుంచి మధుసూదనన్ తో సహ ఉప ఎన్నికల్లో జయలలిత మేనకోడలు దీపా జయకుమార్, డీఎంకే, బీజేపీ, డీఎండీకే, సీపీఎం తదితర పార్టీల నాయకులు పోటీలో ఉన్నారు.
డబ్బులు పంచడానికి కొత్త ఎత్తులు
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా ఓటర్లకు డబ్బులు పంపిణి చెయ్యకుండా చూడటానికి ఎన్నికల కమిషన్ కట్టుదిటమైన చర్యలు తీసుకుంది. అయితే ఎన్నికల అధికారుల కళ్లు కప్పి ఓటర్లకు డబ్బు పంపిణి చెయ్యడానికి పోటీలో ఉన్న కొందరు అభ్యర్థులు కొత్త ఎత్తులు వేస్తున్నారు.
ఇది మా సాంప్రదాయం అంటున్నారు
హిందూ సాంప్రదాయం ప్రకారం ఎవరైనా స్వాగతం పలికితే ఆడపడుచులకు కానుకలు ఇస్తుంటారు. ఇలా స్వాగతం పలికిన వారికి మేము సాంప్రదాయం ప్రకారం కానుకలు ఇస్తున్నామని పలు పార్టీల నాయకులు ఎన్నికల అధికారులకు మస్కా కొడుతున్నారు.
హారతి పట్టుకుని వస్తే
ఆర్ కే నగర్ లో పోటీ చేస్తున్న తమ అభిమాన నాయకులకు స్వాగతం పలకడానికి ఆ నియోజక వర్గంలోని ఆడపడుచులు పోటీ పడుతున్నారు. హారతి ఇచ్చి స్వాగతం పలికిన ప్రతి మహిళకు పళ్లెంలో 100 రూపాయలు వేస్తున్నారు. ఎన్నికల అధికారులు ప్రశ్నిస్తే ఇది మా సాంప్రదాయం అంటున్నారు.
ఓపెన్ టాప్ జీపులో ప్రచారం
ఆర్ కే నగర్ లోని పలు ప్రాంతాల్లో ఓపెన్ టాప్ జీపులో అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఇలా ఓపెన్ టాప్ జీపులో ప్రచారం చేసే సమయంలో పై నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల మీద పూలవర్షం కురిపిస్తే ఒక్కొక్కరికి రూ. 500 ఇస్తున్నారు.
ఇప్పుడు మళ్లీ సంక్రాంతి వచ్చింది
సంక్రాంతి పండుగ సందర్బంగా ఇంటి ముందు శుభ్రంగా నీళ్లు చల్లి రంగురంగుల ముగ్గులు వేస్తుంటారు. ఇప్పుడు ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా మరోసారి అక్కడ సంక్రాంతి పండుగ వచ్చింది. ఎన్నికల ప్రచారానికి వస్తున్న అభ్యర్థులకు ప్రతి ఇంటి ముందు శుభ్రంగా నీళ్లు చల్లి రంగురంగుల ముగ్గులతో తమ అభిమాన నాయకులకు స్వాగతం పలుకుతున్నారు. ఇలా ముగ్గు వేస్తున్న ప్రతి ఒక్కరికి రూ. 500 ఇవ్వడం సర్వసాదారణం అయిపోయింది.
స్థానికుల జోబులు నింపేస్తున్నారు
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా స్థానిక ఓటర్ల పంటపండుతోందని వెలుగు చూసింది. ఎన్నికల అధికారులు ఎమైనా అంటే ఇది మా సాంప్రదాయం అంటున్నారు. ఏమైనా ఉప ఎన్నికల సందర్బంగా ఆర్ కే నగర్ లో ఈ విదంగా వివిద పార్టీల కార్యకర్తల జోబులు నింపేస్తున్నారు.