ఆర్టికల్ 370 రద్దుతో టీఆర్ఎస్, ఎంఐఎం నేతలకు చెంపపెట్టు.. బండి, ధర్మపురి ఫైర్..!
ఢిల్లీ : టీఆర్ఎస్, ఎంఐఎం నేతలకు చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేయడం ఆ రెండు పార్టీల నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని ఫైరయ్యారు. సోమవారం నాడు రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆర్టికల్ 370 రద్దుపై ప్రకటన చేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో బీజేపీ ఎంపీలు ధర్మపురి అర్వింద్, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపికయ్యాయి. టీఆర్ఎస్, ఎంఐఎం నేతలను టార్గెట్ చేస్తూ పలు అంశాలను ప్రస్తావించారు.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పండుగే..!
ఆర్టికల్ 370 రద్దు క్రమంలో అర్వింద్ మాట్లాడుతూ.. శ్రావణమాస సోమవారం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పండుగ వాతావరణం నెలకొందని అభిప్రాయపడ్డారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో పాటు వేలమంది సైనికుల ఆత్మలకు ఈ రోజు శాంతి కలుగుతుందని వ్యాఖ్యానించారు. అదలావుంటే అసలు జమ్ము కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాదన్నట్లుగా మాట్లాడిన టీఆర్ఎస్, ఎంఐఎం నాయకులకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు.
ఆర్టికల్ 370ని రద్దు చేయటం తన చిన్నప్పటి కల అని.. దాన్ని రద్దు చేస్తూ తీసుకొచ్చిన బిల్లుపై ఓటు వేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. 370 ఆర్టికల్ రద్దుతో జమ్మూకశ్మీర్ అభివృద్ధి స్పీడప్ అవుతుందని, ఆ క్రమంలో అనేక కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు అర్వింద్.
మోడీ, అమిత్షా యాక్షన్ మూడ్.. ఇక అరాచక శక్తులకు బ్రేక్.. కశ్మీర్ ఇష్యూపై రాజాసింగ్ (వీడియో)
వ్యతిరేకిస్తున్న పార్టీలు సిగ్గుపడాలన్న బండి
ఇదే అంశంపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తున్న పార్టీలు సిగ్గుతో తలవంచుకోవాలని మండిపడ్డారు. మొన్నటి లోక్సభ ఎన్నికల సమయంలోనే బీజేపీ తన మేనిఫెస్టోలో ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ మేరకు మోడీ, అమిత్ షా ఇచ్చిన మాటకు కట్టుబడి ఇవాళ ఆ వాగ్ధానం నెరవేర్చారని చెప్పుకొచ్చారు.
ఒకే దేశం ఒకే రాజ్యాంగం అనే భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కల ఇన్నాళ్లకు నెరవేరిందని వెల్లడించారు. ఈ రోజు ఆర్టికల్ 370 రద్దుతో దేశ ప్రజలందరూ సంతోషంగా విజయోత్సవాలు జరుపుకుంటున్నారని వివరించారు. జమ్మూకశ్మీర్ దేశంలో అంతర్భాగమని, అది ఎవరి జాగీరు కాదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని, కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమో కాదో కాంగ్రెస్ పార్టీ సహా ఇతర పార్టీల నేతలు కూడా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
రాజాసింగ్ వీడియో సందేశం
అదలావుంటే ఆర్టికల్ 370 రద్దును స్వాగతిస్తూ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వీడియో రిలీజ్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా యాక్షన్ మూడ్లో ఉన్నారని.. ఈ సమయంలో ఎవరైనా అడ్డొస్తే వారి భాషలోనే సమాధానం చెప్పేందుకు ఇద్దరు కూడా రెడీగా ఉన్నారని చెప్పుకొచ్చారు.
జమ్ముకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే విధంగా 370, 35(ఏ) ఆర్టికల్స్ను రద్దు చేయడం భారతదేశ చరిత్రలో మరచిపోలేని రోజుగా అభివర్ణించారు. ఎన్నికల మేనిఫెస్టో హామీ మేరకు కట్టుబడి మోడీ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. మాటిస్తే మడమ తిప్పని నేతగా మోడీ మరోసారి ప్రూవ్ చేసుకున్నారని.. ఇక జమ్ము కశ్మీర్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.