పాఠ్యాంశంగా ఆర్టికల్ 370 రద్దు: జేపీ నడ్డా: ఓట్ల కోసమేనంటోన్న కాంగ్రెస్
పుణే: కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ విభజన. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించి.. కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లును ఆమోదింపజేసుకోవడాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా మార్చకున్నారు కమలనాథులు. మహారాష్ట్ర, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న భారతీయ జనతాపార్టీ నాయకులు ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
కాశ్మీర్ లో 50 వేల ఆలయాలు, పాఠశాలలను పునరుద్ధరిస్తాం: త్వరలో సర్వే: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఇందులో భాగంగా.. బీజేపీ తాత్కాలిక అధ్యక్షుడు జేనీ నడ్డా మరో కీలక ప్రకటన చేశారు. ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని పాఠ్యాంశంగా చేరుస్తామని తెలిపారు. భవిష్యత్ తరాలు దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దీన్ని ఎన్నికల స్టంట్ గా ఆరోపిస్తోంది కాంగ్రెస్. ఆర్టికల్ 370 రద్దు అంశం నుంచి ఓట్లను రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ విమర్శిస్తోంది. జేపీ నడ్డా చేసిన ప్రకటనపై ఎన్నికల ప్రధాన అధికారిపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది.
ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని ఎన్నికల అజెండాగా తీసుకుంటామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కొద్దిరోజుల కిందటే సూచనప్రాయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన కొన్ని గంటల వ్యవధిలో ఆయన ముంబైలో ఎన్నికల ర్యాలీని నిర్వహించారు. ఆర్టికల్ 370 రద్దు అంశాన్నే ప్రధానంగా ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దానికి కొనసాగింపుగా.. జేపీ నడ్డా తాజాగా ప్రకటన చేయడం చర్చనీయాంశమైంది. పుణేలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.
సీబీఎస్ఈ, ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని పాఠ్యాంశాలుగా చేర్చుతామని అన్నారు. స్టేట్ సిలబస్ లోనూ ఈ అంశాన్ని పొందుపర్చాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తామని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన, జమ్మూ కాశ్మీర్, లడక్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఎలా ఆవిర్భవించడానికి గల పూర్తి కారణాలను పాఠ్యాంశాల్లో వివరిస్తామని అన్నారు. భవిష్యత్ తరాలు దీని గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ దీన్ని ఓ అజెండాగా తీసుకుందని అన్నారు.