అరుణ్ జైట్లీకి అస్వస్థత.. ఎయిమ్స్లో చేరిక
Recommended Video
న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరారు. ఎయిమ్స్లోని కార్డియాలజీ విభాగంలో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనారోగ్య పరిస్థితుల వల్లే ఆయన మోడీ 2.0 క్యాబినెట్లో మంత్రి పదవీ చేపట్టని సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఇంటికెళ్లి మంత్రి పదవీ చేపట్టాలని కోరినా .. అనారోగ్య కారణాల వల్ల క్యాబినెట్లో చేరేందుకు అంగీకరించలేదు.
ఒంట్లో నలతగా ఉండటంతో అరుణ్ జైట్లీని కుటుంబసభ్యులు ఎయిమ్స్ తీసుకొచ్చారు. ఇక్కడి కార్డియాలజీ విభాగంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గత రెండేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో జైట్లీ బాధపడుతున్న సంగతి తెలిసిందే. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం అమెరికాలో కూడా ట్రీట్ మెంట్ తీసుకున్నారు. అయినా అతని ఆరోగ్యం మెరుగుపడలేదు. మోడీ 1.0 ప్రభుత్వంలో కీలకమైన ఆర్థికశాఖ పదవీ చేపట్టారు జైట్లీ. విత్త మంత్రిగా సంస్కరణలను ప్రవేశపెట్టారు. అయితే ఎన్నికలకు ముందు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీ సంబంధిత వ్యాధి కోసం వైద్యం కోసం అమెరికా వెళ్లిపోయారు. దీంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను జైట్లీకి బదులు పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇండియా తిరిగొచ్చిన ఆరోగ్యం మాత్రం కుదుటపడలేదు.
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రత్యక్ష ఎన్నికలకు కూడా దూరంగా ఉన్నారు. అయితే ఎన్డీఏ భారీ మెజార్టీతో విజయం సాధించింది. దీంతో తాను మంత్రి పదవీ చేపట్టబోనని ప్రధాని మోడీకి లేఖరాశారు. అనారోగ్య పరిస్థితుల వల్ల దూరంగా ఉంటున్నానని ప్రకటించారు. అయితే మోడీ స్వయంగా ఇంటికెళ్లి .. క్యాబినెట్లో చేరాలిన కోరినా .. సున్నితంగా తిరస్కరించారు.