ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిపడ్డ జైట్లీ, ఎయిమ్స్కు తరలింపు.. వైద్యులను వాకబుచేసిన మోడీ
న్యూఢిల్లీ : మాజీ కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డారు. వెంటనే కుటుంబసభ్యులు ఆయనను ఎయిమ్స్ తీసుకొచ్చారు. అక్కడ కార్డియాలజీ విభాగంలో వైద్యుల బృందం జైట్లీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనారోగ్య పరిస్థితుల వల్లే జైట్లీ .. మోడీ 2.0 క్యాబినెట్లో మంత్రి పదవీ చేపట్టని సంగతి తెలిసిందే.
కిడ్నీ సంబంధిత వ్యాధి
జైట్లీ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇదివరకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న ఆరోగ్యం మెరుగుపడలేదు. డయాబెటిస్తో బాధపడుతున్న ఆయన 2014లో లైపో సర్జరీ చేయించుకున్నారు. అప్పటినుంచి ఆయనను ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. అనారోగ్యం వల్లే మోడీ 2.0 క్యాబినెట్లో చేరలేదు. ఇవాళ ఉదయం శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటంతో ఎయిమ్స్ తరలించారు. ఆయనను ఉదయం 11 గంటలకు ఆస్పత్రికి తీసుకున్నారు. అక్కడ ఎండోక్రైనలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, కార్డియాలజిస్ట్ విభాగాల అధిపతుల జైట్లీకి వైద్యం అందిస్తున్నారు. జైట్లీ అనారోగ్యం గురించి విషయం తెలిసిన వెంటనే ఆస్పత్రి వద్దకు నేతలు తరలి వచ్చారు. జైట్లీ అస్వస్థతకు గురయ్యారని తెలిసి ప్రధాని నరేంద్ర మోడీ ఎయిమ్స్ వచ్చారు. సాయంత్రం ఆస్పత్రికి వచ్చి .. జైట్లీ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు కేంద్రమంత్రులు అమిత్ షా, హర్షవర్థన్, స్పీకర్ ఓం బిర్లా కూడా ఆస్పత్రికి వచ్చారు.
మెరుగుపడని ఆరోగ్యం
గత రెండేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో జైట్లీ బాధపడుతున్న సంగతి తెలిసిందే. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం అమెరికాలో కూడా ట్రీట్ మెంట్ తీసుకున్నారు. అయినా అతని ఆరోగ్యం మెరుగుపడలేదు. మోడీ 1.0 ప్రభుత్వంలో కీలకమైన ఆర్థికశాఖ పదవీ చేపట్టారు జైట్లీ. విత్త మంత్రిగా సంస్కరణలను ప్రవేశపెట్టారు. అయితే ఎన్నికలకు ముందు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీ సంబంధిత వ్యాధి కోసం వైద్యం కోసం అమెరికా వెళ్లిపోయారు. దీంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను జైట్లీకి బదులు పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇండియా తిరిగొచ్చిన ఆరోగ్యం మాత్రం కుదుటపడలేదు.
రాజకీయాలకు దూరం
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రత్యక్ష ఎన్నికలకు కూడా దూరంగా ఉన్నారు. అయితే ఎన్డీఏ భారీ మెజార్టీతో విజయం సాధించింది. దీంతో తాను మంత్రి పదవీ చేపట్టబోనని ప్రధాని మోడీకి లేఖరాశారు. అనారోగ్య పరిస్థితుల వల్ల దూరంగా ఉంటున్నానని ప్రకటించారు. అయితే మోడీ స్వయంగా ఇంటికెళ్లి .. క్యాబినెట్లో చేరాలిన కోరినా .. సున్నితంగా తిరస్కరించారు. తాను మంత్రివర్గంలో చేరబోనని స్పష్టంచేశారు.