ఆధార్తో ఏటా రూ. 90వేల కోట్లు ఆదా, సుప్రీం తీర్పు చరిత్రాత్మకం: జైట్లీ
న్యూఢిల్లీ: ఆధార్ విషయంలో బుధవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి ఆధార్ ఎంతో మేలు చేకూర్చిందని ఆయన తెలిపారు. ఆధార్ ద్వారా ఏటా దాదాపు రూ.90వేల కోట్ల మేర డబ్బును ఆదా చేయగలిగామని జైట్లీ వివరించారు.
ఆధార్ రాజ్యాంగబద్ధమేనంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్రమంత్రులు జైట్లీ, రవిశంకర్ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఆధార్ విధానాన్ని న్యాయ పరిశీలన అనంతరం కోర్టు అంగీకరించిందని, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని జైట్లీ తెలిపారు.
'దేశంలో 122 కోట్ల మంది ప్రజలు ఆధార్ను కలిగి ఉన్నారు. ఆధార్ వల్ల ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందిన వారిని గుర్తించగలుతున్నాం. ఇప్పటికే ఆధార్ వల్ల ఏటా దాదాపు రూ.90వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఆదా చేసింది' అని జైట్లీ తెలిపారు.
ఆధార్ను విమర్శించిన వారంతా సాంకేతికతను తిరస్కరించకూడదని జైట్లీ సూచించారు. మార్పులను అంగీకరించాలని కోరారు. కాంగ్రెస్ ఆధార్ను ప్రారంభించింది కానీ, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ఆ పార్టీకి తెలియలేదని ఎద్దేవా చేశారు. బుధవారం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి లభించిన ప్రోత్సాహమని అన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిని ప్రజలకు చేకూర్చడానికి ఆధార్ ఎంతగానో అవసరమని తెలిపారు.