పన్నులు కడితే ఈ పరిస్థితి ఉండదుగా!: చమురు ధరల విషయమై అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: ప్రజలు నిజాయితీగా పన్నులు కడితే ప్రభుత్వం ఆదాయం కోసం చమురు పైన ఆధారపడే పరిస్థితి ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం అన్నారు. తద్వారా చమురుపై ఎలాంటి పన్ను కోతలు ఉండవని ఆయన చెప్పకనే చెప్పారు. కేవలం వేతన జీవులు మాత్రమే పన్నులు సక్రమంగా చెల్లిస్తున్నారన్నారు.
మిగిలిన వర్గాలు కూడా పన్నుల చెల్లింపు సరిగా చేయాలని విజ్ఞప్తి చేశారు. తాను రాజకీయ నాయకులు, విశ్లేషకులకు ఓ విషయం విజ్ఞప్తి చేస్తున్నానని, ఇంధనేతర రంగాల్లో పన్నుల ఎగవేత ఆపాలని కోరుతున్నానని, ప్రజలు కనుక అన్ని రకాల పన్నులు సరిగా చెల్లిస్తే చమురుపై విధించే పన్నులు కూడా తగ్గుతాయన్నారు. ఈ మేరకు ఆయన ఫేస్బుక్లో పోస్టు పెట్టారు.
2017-18 జీడీపీలో ఇంధనేతర రంగం నుంచి వచ్చిన పన్నుల వాటా 9.8శాతంగా ఉందన్నారు. 2007-08 తర్వాత ఇదే అత్యధికమని చెప్పారు. దీంతో పాటు ఇంధనంపై రాష్ట్రాలు విధిస్తున్న పన్నులను తప్పుపట్టారు. వినియోగదారులు ఆర్థికంగా బాధ్యతతో వ్యవహరిస్తే చమురు ధరల్లో ఉపశమనం ఉంటుందన్నారు. కేంద్రం ఆర్థికంగా బలపడుతుందన్నారు. రాష్ట్రాలు అదనంగా విధించే పన్నుల కారణంగానే చమురు ధరలు అసాధారణంగా పెరుగుతున్నాయన్నారు.