వేతన జీవులకు నిరాశే! మారని పన్ను శ్లాబులు, రేట్లు, రూ.40 వేల స్టాండర్డ్ డిడక్షన్తో సరి!
న్యూఢిల్లీ: కొత్త సార్వత్రిక బడ్జెట్లో వేతన జీవులకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2018-19 వార్షిక బడ్జెట్లో ఉద్యోగులకు చెప్పుకోదగ్గ పన్ను ప్రయోజనాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైందనే చెప్పొచ్చు.
Recommended Video
బహుముఖ లక్ష్యం.. అదే జైట్లీ బడ్జెట్ వ్యూహం! ఎనిమిది రాష్ట్రాల ఎన్నికలతో ఆర్థిక క్రమశిక్షణ గోవిందా!
ఆర్థిక లావాదేవీలు రూ.2.5 లక్షలు దాటితే పాన్ నంబర్ తప్పనిసరి!
ఈ బడ్జెట్లో వేతన జీవులకు సంబంధించి వ్యక్తిగత పన్ను శ్లాబులుగానీ, పన్ను రేట్లుగానీ మార్చకపోవడం తీవ్ర ఆశాభంగం కలిగించింది. అయితే గత మూడేళ్లుగా ఉద్యోగులకు ఎన్నో ప్రయోజనాలు కల్పించిన దృష్ట్యా.. ఈసారి స్టాండర్డ్ డిడక్షన్ మినహా ఎలాంటి ప్రయోజనాలు కల్పించడం లేదని ఆర్థిక మంత్రి స్వయంగా ప్రకటించడం గమనార్హం.
వేతన జీవులకు తీవ్ర ఆశాభంగం...
కొత్త వార్షిక బడ్జెట్పై వేతనజీవుల అంచనాలు తలకిందులయ్యాయి. మధ్యతరగతి ఉద్యోగుల ఆశలపై ఆర్థికమంత్రి నీళ్లు చల్లారు. పన్ను శ్లాబుల్లో మార్పులేమీ చేయకుండా కేవలం స్టాండర్డ్ డిడక్షన్తో సరిపెట్టుకోమన్నారు.స్టాండర్డ్ డిడక్షన్ తిరిగి ప్రవేశపెట్టే విషయంపై ముందుగానే ఒక అంచనా ఉన్నప్పటికీ.. వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లు, శ్లాబుల విషయంలో వారు మోడీ సర్కారు నుంచి ఎంతో ఆశించారు. అయితే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ ఉద్యోగ వర్గాలను ఏమాత్రం సంతృప్తి పరచలేకపోయింది.
పన్ను వసూళ్లు పెరిగిన నేపథ్యంలో...
గత రెండేళ్లుగా ఆదాయపు పన్ను వసూళ్లు పెరుగుతున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీయే తన బడ్జెట్ ప్రసంగంలో స్వయంగా వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో 12.6 శాతం అధికంగా వసూలు కాగా.. ప్రస్తుతం జనవరి 15 నాటికల్లా 18.7 శాతం అధికంగా ఆదాయ పన్ను వసూలైందట. అంతేకాదు, ఆదాయపన్ను చెల్లించే వారి సంఖ్య కూడా 6.62 కోట్ల నుంచి 8.55 కోట్లకు పెరిగింది. ఈ నేపథ్యంలో వేతన జీవులకు కొంతైనా ఊరట కలిగించాలన్న ఉద్దేశంతో 2006-07 అసెస్మెంట్ ఇయర్లో ఉపసంహరించిన ‘స్టాండర్డ్ డిడక్షన్'(ప్రామాణిక మినహాయింపు)ను మళ్లీ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి తీసుకొస్తున్నట్లు ఆర్థికమంత్రి జైట్లీ తెలిపారు.
మళ్లీ స్టాండర్డ్ డిడక్షన్...
వేతన జీవులకు సంబంధించి వ్యక్తిగత ఆదాయపన్ను శ్లాబులు కూడా ఈ ఏడాది బడ్జెట్లో మారలేదు. రెండు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న వ్యక్తిగత పన్ను శ్లాబులను.. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో సమీక్షిస్తారని ఆశించిన వేతన జీవులకు.. నిరుత్సాహమే ఎదురైంది. అయితే.. స్టాండర్డ్ డిడక్షన్ రూపంలో ఉద్యోగులకు, పెన్షనర్లకు కొంత ఊరటనిచ్చే ప్రయత్నం చేశారు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, మెడికల్ రీయింబర్స్మెంట్కు బదులుగా రూ.40 వేల స్టాండర్డ్ డిడక్షన్ (ప్రామాణిక మినహాయింపు)ను మళ్లీ ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వేతన జీవులకు ఇది అమలులోకి రానుంది.
స్టాండర్డ్ డిడక్షన్ అంటే...
2018-19 వార్షిక బడ్జెట్లో ప్రభుత్వం పన్నులు చెల్లించే ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.40 వేల ఫ్లాట్ ‘స్టాండర్డ్ డిడక్షన్'తో కాస్త ఊరట కల్పించింది. గతంలో బిల్లులు, డాక్యుమెంట్లు సమర్పించి కొంత మంది కన్వేయన్స్ అలవెన్సును, మరికొంత మంది మెడికల్ అలవెన్సును పొందేవారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ అలవెన్సులు, బిల్లులు, డాక్యుమెంట్లను తొలగించి వేతన జీవులకు ఫ్లాట్గా రూ.40 వేల స్టాండర్డ్ డిడక్షన్ను కల్పించింది. పన్ను చెల్లించే ఉద్యోగులు, పెన్షనర్లు నేరుగా ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. గతంలో ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేది రూ.30 వేలుగా ఉండేది. 2006-07 అసెస్మెంట్ ఇయర్లో దీనిని అప్పటి ప్రభుత్వం తీసివేసింది. దీంతో అప్పట్నించి వేతన జీవులు తమ స్థూల ఆదాయం(మొత్తం ఆదాయం)పై పన్ను చెల్లించాల్సి వస్తోంది.
ఎంత వరకు ప్రయోజనం?
తిరిగి 12 ఏళ్ల తరువాత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ స్టాండర్డ్ డిడక్షన్ను ప్రవేశపెట్టారు. అయితే దీనిని ఇప్పుడు రూ.40 వేలు చేశారు. దీనివల్ల ఉద్యోగులకు కొంత వరకు ప్రయోజనం చేకూరుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉద్యోగుల వార్షిక ఆదాయంలో నిర్ణీత మేర (రూ.40 వేలు) తీసేసిన తర్వాతే దాన్ని పన్ను ఆదాయం కింద పరిగణిస్తారు. సెక్షన్ 80సీ, ఇతర మినహాయింపులు వేరే. స్టాండర్డ్ డిడక్షన్కు ఎటువంటి ఆధారాలు, బిల్లులు సమర్పించాల్సిన అవసరం లేదు.
అక్కడ తగ్గి, ఇక్కడ పెరుగుతుంది.. అంతే...
నిజానికి ఉద్యోగి జీతంలో నెలకు రూ.1,600 చొప్పున (ఏడాదికి రూ.19,200) రవాణా భత్యం ఉంటుంది. దీనిపై ఇప్పుడు పన్ను లేదు. అలాగే ఏడాదికి రూ.15,000 వరకు మెడికల్ ఖర్చులను ఆదాయం నుంచి తగ్గించి చూపించుకోవచ్చు. ఆ లెక్కన ఏటా రూ.34,200పై కూడా ఇప్పుడు పన్ను లేదు!! మరిక రూ. 40,000 స్టాండర్డ్ డిడక్ష న్ వల్ల లాభమెంత అంటే.. కేవలం రూ.5,800. కానీ ఇక్కడో మెలిక ఉంది. ఈ స్టాండర్డ్ డిడక్షన్ విధానాన్ని మళ్లీ తీసుకొచ్చిన నేపథ్యంలో ఇప్పుడు రవాణా భత్యం, వైద్య ఖర్చులను పన్ను పరిధిలోకీ తీసుకొచ్చారు. పెద్ద తేడా ఏమీ ఉండదు. అక్కడ తగ్గుతుంది.. ఇక్కడ పెరుగుతుంది.. అంతే!