మీ ట్రాక్ రికార్డ్ మరిచారా, మేం వణికిపోం: యశ్వంత్-చిద్దూలకు జైట్లీ గట్టి కౌంటర్
మోడీ ప్రభుత్వంపై, తనపై విమర్శలు చేస్తున్న యశ్వంత్ సిన్హాకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఘాటైన సమాధానం ఇచ్చారు.
న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వంపై, తనపై విమర్శలు చేస్తున్న యశ్వంత్ సిన్హాకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఘాటైన సమాధానం ఇచ్చారు.
చదవండి: దమ్ముందా.. మోడీ ప్రభుత్వానికి శివసేన సవాల్
ప్రస్తుత నాయకత్వం ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే వణికిపోదని అన్నారు. భారత్ ధైర్యసాహసాలు నిండిన నాయకత్వాన్ని చూపిస్తోందన్నారు. మన నాయకత్వం నిర్ణయాలు తీసుకోవడంలో వణికిపోయే ప్రసక్తే లేదన్నారు.
విధానపరమైన స్తబ్ధతకు ముగింపు పలికి, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో మన ఆర్థిక వ్యవస్థను సమైక్యపరిచిందన్నారు. తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. చాలా మార్పులు చేస్తోందన్నారు. ఆర్థిక దార్శనికత సులువైన పని కాదన్నారు.
పెద్ద నోట్ల రద్దు తర్వాత జీఎస్టీపై తాను తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నానన్నారు. విదేశీ ఖాతాల విషయంలో నిజాయతీగా ఉండే అవకాశాన్ని తమ ప్రభుత్వం కల్పించిందన్నారు. ఆర్థిక మందగమనం వల్ల పన్నుల వసూళ్ళపై ప్రభావం లేదన్నారు.
జిఎస్టీ లెక్కలు ఊహించినదానికి అనుగుణంగానే ఉన్నాయని చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థ మూడేళ్ళ నుంచి వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. స్వల్ప కాలిక మందగమనాన్ని ముందుగానే ఊహించామన్నారు. దీర్ఘకాలిక మేలు జరుగుతుందన్నారు.
ప్రస్తుతం కఠిన చర్యలు అవసరమన్నారు. ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. బడ్జెట్లో పైకి కనిపించని లోటు ఇకపై ఉండదన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అన్నారు.
చెల్లింపుల్లో ప్రత్యామ్నాయ యంత్రాంగాలపై ఆధారపడకుండా మన దేశంలో వ్యాపారం చేయడానికి అవకాశం లేదన్నారు. విచక్షణను ఉపయోగించడం, దుర్వినియోగం చేయడం వల్ల కొన్ని అంశాల్లో స్తబ్ధత ఏర్పడిందని యూపీఏ పరిపాలనను గుర్తు చేశారు.
ఇటువంటివాటి నుంచి పూర్తిగా దూరమయ్యే సామర్థ్యం తమకు ఉందన్నారు. అంతేకాదు, యశ్వంత్ సిన్హా తన ట్రాక్ రికార్డును ఈ 80 ఏళ్ల వయస్సులో మరిచిపోయారని ఎద్దేవా చేశారు. చిదంబరం కూడా ఆర్థికమంత్రిగా తన ట్రాక్ రికార్డు మరిచిపోయారన్నారు.