రాహుల్ జ్ఝానం లేని నిపుణుడు: జైట్లీ ఎదురుదాడి
న్యూఢిల్లీ: లలిత్ గేట్పై లోకసభలో జరిగిన చర్చకు బుధవారం సమాధానం ఇస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కాంగ్రెసుపై ఎదురుదాడికి దిగారు. కాంగ్రెసు పార్టీ కొండను తవ్వి ఎలుకను కూడా బయటపెట్టలేకపోయిందని ఆయన అన్నారు. అరుణ్ జైట్లీ సమాధానం ఇస్తుండగా కాంగ్రెసు, వామపక్షాలు, ఆర్జెడీ, జెడియు సభ నుంచి వాకౌట్ చేశాయి.
యుపిఎ ప్రభుత్వం తప్పుడు విధానాల వల్ల లలిత్ మోడీ లండన్ వెళ్లిపోయినందున తమ ప్రభుత్వం అరెస్టు చేయలేకపోయిందని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో లలిత్ మోడీపై ఫెమా కింద మాత్రమే కేసు పెట్టారని, దాని కింద అరెస్టు చేసే అవకాశం లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని ఆయన అన్నారు.
లలిత్ మోడీపై రెడ్ కార్నర్ నోటీసు గానీ, బ్లూ కార్నర్ నోటీసు గానీ జారీ చేయలేదని, దాంతో లలిత్ మోడీ లండన్ వెళ్లి దాక్కున్నాడని ఆయన అన్నారు. లలిత్ మోడీ విషయంలో తాము తప్పు చేసి ఉంటే ఆధారాలు చూపాలని అడిగామని, సభలో గొడవ చేసిన కాంగ్రెసు ఆధారాలు చూపలేకపోయిందని ఆయన అన్నారు.
లలిత్ మోడీపై కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో లైట్ బ్లూ కార్నర్ నోటీసు మాత్రమే జారీ చేశారని, అది దేశీయ విమానాశ్రయాలకు మాత్రమే వర్తిస్తుందని, అప్పటికే లలిత్ మోడీ లండన్ వెళ్లిపోవడానికి అవకాశం చిక్కిందని ఆయన అన్నారు.
పిఎంఎల్ఎ కింద కేసు పెడితే మాత్రమే లలిత్ మోడీని అరెస్టు చేయడానికి అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీ జ్ఞానం లేని నిపుణుడని ఆయన వ్యాఖ్యానించారు. జిఎస్టి బిల్లును కాంగ్రెసు హయంలోనే రూపొందించి ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే చేసిన ఆరోపణలను తాము ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.
దేశంలో ఇంకా చాలా మంది నిజాయితీపరులున్నారని, వారు పిల్లలు బతకడానికి పనిచేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తరాలుగా ఈ దేశంలోని రాజకీయాలపై ఆధిపత్యం చెలాయిస్తున్న కుటుంబం దేశ ప్రజలు జీవించడానికి పనిచేయలేదని ఆయన అన్నారు.
సుష్మా స్వరాజ్పై చేసిన ఆరోపణలను అన్నింటినీ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని, ఆమె రాజీనామా చేసే ప్రసక్తి లేదని అరుణ్ జైట్లీ అన్నారు. సుష్మా పట్ల పూర్తి సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సుష్మాను బలిపశువును చేయడానికి ప్రయత్నించారని ఆయన అన్నారు. జిఎస్టిని వ్యతిరేకించడానికే ఆమెపై ఆరోపణలను ముందుకు తెచ్చారని ఆయన అన్నారు.
విదేశాల్లోని నల్లధనాన్ని రప్పించడానికి కాంగ్రెసు ఏం కృషి చేసిందని ఆయన ప్రశ్నించారు. మూడు కోతుల గురించి మాట్లాడడానికి రాహుల్ గాంధీ చాలా ఇష్టపడుతున్నారని, ఈ దేశాన్ని కోతిలా తయారు చేయవద్దని తాను కోరుతున్నానని ఆయన అన్నారు.
ప్రశాంత వాతావరణంలో రాహుల్ గాంధీ తమ మాదిరిగా మాట్లాడాలని అనుకుంటే ఆయనకు కాళ్లు నిలబడవని అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. తప్పుడు విధానాలు అనుసరించాలని, నల్లధనం తిరిగి రావద్దని కాంగ్రెసు కోరుకుంటోందని ఆయన అన్నారు.