అరుణ్ జైట్లీ పెన్షన్ రాజ్యసభ నాలుగో తరగతి ఉద్యోగులకు ఇవ్వాలని ఉదారత చాటుకున్న కుటుంబం
ఇటీవల మృతి చెందిన మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కి రాజ్యసభ సభ్యుడిగా పని చేసినందుకు ఇవ్వనున్న పెన్షన్ ను ఆయన కుటుంబం తిరస్కరించింది. అరుణ్ జైట్లీ కుటుంబానికి ఇవ్వనున్న పెన్షన్ ను రాజ్యసభ లో ఉన్న తక్కువ జీతంతో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగులకు ఇవ్వాలని చెప్తూ అరుణ్ జైట్లీ భార్య లేఖ రాశారు. దివంగత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ భార్య సంగీత జైట్లీ రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు కు లేఖ రాస్తూ, అదే లేఖను ప్రధాని నరేంద్ర మోడీకి సైతం పంపించారు.
ఇక లేఖలో సంగీత జైట్లీ తన భర్త అరుణ్ జైట్లీకి ఒక ఎంపీగా చేసిన సేవలకు గాను గుర్తింపుగా మీరు ఇవ్వదలచుకొన్న పెన్షన్ ను రాజ్యసభలో నాలుగవ తరగతి సిబ్బందికి చెల్లించాలని ఆమె కోరారు. ఎందుకంటే అరుణ్ జైట్లీ మొదటినుండి పరోపకార స్వభావం ఉన్న వ్యక్తి అని, ఆయన బాటలోనే తాము సైతం రాజ్యసభ ఇవ్వనున్న పెన్షన్ ను పరోపకారానికి ఉపయోగించ దలచి నట్లుగా ఆమె పేర్కొన్నారు.
సుదీర్ఘ అనారోగ్యం తర్వాత ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఆగస్టు 24వ తేదీన మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆగస్టు 9న ఎయిమ్స్ లో చేరిన ఆయన తీవ్ర అనారోగ్యంతో ఆగస్టు 24న మృతిచెందారు. ఇక అరుణ్ జైట్లీ కుటుంబానికి పార్లమెంటు సభ్యుల జీతభత్యాల చట్టం ప్రకారం, ఒక మాజీ ఎంపీ కి నెలకు కనీస పింఛను 20000 మరియు అదనంగా నెలకు 1500 పెన్షన్ లభిస్తుంది. అయితే అరుణ్ జైట్లీ 1999 నుండి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కారణంగా ఆయనకు అదనంగా 22500 తో మొత్తం 50 వేల వరకు పెన్షన్ లభించింది. ఇక మాజీ ఎంపీ మరణానంతరం ఆయనపై ఆధారపడిన కుటుంబం కోసం పెన్షన్ లో 50% చెల్లించ నున్నారు. దీంతో అరుణ్ జైట్లీ కుటుంబానికి నెలకు 25 వేలు సంవత్సరానికి మూడు లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంది.
అరుణ్ జైట్లీ మొదటి నుండి సేవా దృక్పథం ఉన్న వ్యక్తి కావడంతో, పరులకు సహాయం చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి కావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయనకు ఇచ్చే పెన్షన్ ను రాజ్యసభలో నాలుగో తరగతి ఉద్యోగులకు ఇవ్వాలని చెప్పి లేఖ రాసి తన ఉదారతను చాటుకున్నారు. ఆయన తన దగ్గర పనిచేసే సిబ్బంది పిల్లల చదువుల కోసం పలుమార్లు సహాయం అందించారు. 2018 మే నెలలో ఎయిమ్స్ లో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న తరువాత అక్కడ మౌలిక వసతుల ఇబ్బందులను చూసి ఆయన కుటుంబం ఢిల్లీలోని ఎయిమ్స్ కు నీటి శీతలీకరణ మరియు పంపిణీ యూనిట్లను విరాళంగా అందించింది.
ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గ ఏర్పాటు నేపథ్యంలో ప్రమాణస్వీకారానికి ఒకరోజు ముందు ఆరోగ్యం సహకరించని కారణంగా మంత్రిగా బాధ్యతలు తీసుకోలేక పోతున్నానని పేర్కొన్నారు. ఇక అంతే కాదు మంత్రి గా ఇచ్చిన క్వార్టర్ ను ఖాళీ చేసి తన సొంత ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. అలాంటి మంచి ఉదారత ఉన్న నాయకుడు అరుణ్ జైట్లీ కావడంతో ఆయన కుటుంబం కూడా ఆయన మార్గంలోనే నడుస్తూ ఉదారతను చాటుకున్నారు.