డిఫాల్టర్: రాజకీయమని సుజనని వెనుకేసుకొచ్చిన జైట్లీ
న్యూఢిల్లీ/హైదరాబాద్: కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ నేత సుజనా చౌదరి పైన కాంగ్రెస్ పార్టీ చేసిన డిఫాల్టర్ వ్యాఖ్యల పైన బీజేపీ నేత, మరో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ సోమవారం స్పందించారు. సుజన పైన ఆరోపణలను జైట్లీ ఖండించారు. సుజనా చౌదరిపై కాంగ్రెస్ చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు.
సుజనాకి చెందిన ఒక సంస్థ నష్టాల్లో పడిపోయిందని, ఆ సంస్థకు సంబంధించిన రుణాలను పునర్ వ్యవస్థీకరించటం జరిగిందని, అప్పటి నుండి ఆ సంస్థ సదరు బ్యాంకుకు వాయిదాలను క్రమం తప్పకుండా చెల్లిస్తోందని జైట్లీ తెలిపారు. సుజన ఆంధ్రప్రదేశ్లో పేరున్న పారిశ్రామికవేత్త అన్నారు.
అలాగే, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గం పునర్ వ్యవస్థీకరణపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను కూడా తీవ్రంగా ఖండించారు. మోడీ కొత్త మంత్రులకు సంబంధించిన అన్ని అంశాలను లోతుగా పరిశీలించిన తరువాతనే మంత్రివర్గంలో చేర్చుకున్నారన్నారు.
కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన వారిపై క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఖండించారు. కొందరు మంత్రులపై ఉన్న కేసులు రాజకీయాలతో ముడిపడి ఉన్నాయి తప్ప నేరాలకు సంబంధించినవి కాదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతారహిత ఆరోపణలు చేయకూడదన్నారు.
సుజన స్పందన
సెంట్రల్ బ్యాంకుకు తన కంపెనీ సుజనా టవర్స్ 317 కోట్ల రూపాయల రుణం చెల్లించవలసి ఉన్నదంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని కేంద్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి స్పష్టం చేశారు. తనపై బురద చల్లాలనే దురుద్దేశంతోనే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. సుజనా టవర్స్ కంపెనీలు ముప్పై సంవత్సరాల క్రితం రిజిష్టరు అయిన సంస్థలని, చట్ట ప్రకారమే తమ సంస్థలు పని చేస్తున్నాయన్నారు.
కాగా, సుజనా చౌదరిపై కాంగ్రెస్ నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 317 కోట్లు ఎగ్గొట్టిన ఆయన వెంటనే తన పదవికి రాజీనా మా చేయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ సోమవారం విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు.
సుజనా చైర్మన్గా ఉన్న సుజనా టవర్స్ లిమిటెడ్ రూ.317 కోట్లు ఎగ్గొట్టినట్లు ఆరో పిస్తూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల సమాఖ్య, సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం గత మే, అక్టోబర్లో నెలల్లో చేసిన ప్రకటనలను ఆయన విడుదల చేశారు.
‘‘రుణాలను ఎగ్గొట్టిన వారిలో అగ్రస్థానంలో ఉన్న 50 మంది పారిశ్రామికవేత్తల నుంచి రూ.7460 కోట్లను తిరిగి రాని రుణాలుగా (ఎన్పిఏ) భావిస్తున్నట్టు ఈ ప్రకటనలు పేర్కొన్నాయి. రూ.4984 కోట్లను ఎగ్గొట్టిన తొలి 20మంది పారిశ్రామికవేత్తల్లో సుజనా టవర్స్ లిమిటెడ్ 8వ స్థానంలో ఉందని ఈ ప్రకటనలు వివరించాయి. ఎగవేత దారులందరి నుంచీ ఈ మొత్తాన్ని రాబట్టి తమ బ్యాంకును కాపాడాలని ఉద్యోగుల సంఘాలు ఈ ప్రకటనలో పేర్కొన్నాయి. సుజనా చౌదరి వెబ్సైట్లోకి వెళితే, ఆయన, మోడీ ఇద్దరూ ఒకర్నొకరు చూసుకుంటున్న దృశ్యం కనపడుతుంది. ప్రక్కనే 300 కోట్లకు పైగా ఎగ్గొట్టిన సుజనా టవర్స్ ఉంటుంది'' అని మాకెన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
మీరు చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదా? కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వారిని కాపాడేందుకే మంత్రివర్గంలో తీసుకున్నారా? ఈవిషయంలో సత్యా సత్యాలను దేశానికి చెప్పాలి. సుజనా రాజీనామా చేయాలని అన్నారు. ఈ వ్యాఖ్యలను అరుణ్ జైట్లీ, సుజనా చౌదరి కొట్టి పారేశారు.