సీజేఐపై ప్రతిపక్షాల అభిశంసన?: కాంగ్రెస్ ప్రతీకార చర్య అన్న జైట్లీ..
న్యూఢిల్లీ: గత కొన్నాళ్లుగా సుప్రీంకోర్టు పనితీరును శంకిస్తూ ఆందోళనకర రీతిలో పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. దేశ చరిత్రలోనే తొలిసారిగా నలుగురు సీనియర్ న్యాయవాదులు మీడియా ముందుకు వచ్చి.. సుప్రీంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పిన నాటి నుంచి ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి.
ఇటీవలి కాలంలో కేసుల కేటాయింపుకు సంబంధించి సుప్రీం నిర్ణయాధికారులను సవాల్ చేస్తూ పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఇక తాజాగా జస్టిస్ లోయా కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పుపై కూడా చాలానే అభ్యంతరాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విపక్షాలన్ని ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన ప్రవేశపెట్టేందుకు సిద్దపడుతున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్తో పాటు ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, ఎస్పీ, బీఎస్పీ పార్టీల ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
ఇదే విషయంపై ఈ రోజు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఛాంబర్లో ఆయా పార్టీల నేతలు భేటీ అయి, అక్కడి నుంచి ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడును కలిసి నోటీసు ఇచ్చారు. అభిశంసనను సమర్థిస్తూ దాదాపు 60 మంది రాజ్యసభ సభ్యులు ఇందులో సంతకం చేసినట్టు తెలుస్తోంది.
ఇది ప్రతీకార చర్య: జైట్లీ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై ప్రవేశపెడుతున్న అభిశంసన తీర్మానంపై కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీ స్పందించారు. ఈ తీర్మానం కాంగ్రెస్ పార్టీ ప్రతీకార చర్యగా అభివర్ణించారు. జస్టిస్ లోయా మృతిపై స్వతంత్ర విచారణకు సుప్రీం నో చెప్పడంతోనే ప్రతిపక్షాలు అభిశంసనకు సిద్దమవుతున్నాయన్నారు.
'జస్టిస్ లోయా మృతిపై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారం బహిర్గతం కావడంతోనే.. ఆ పార్టీ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. అందుకే జస్టిస్ మిశ్రాను అభిశంసన తీర్మానంతో భయపెట్టాలని చూస్తోంది. మాతో ఏకీభవించకపోతే ప్రతీకారం తీర్చుకునేందుకు 50 మంది ఎంపీలు చాలని చెబుతూ.. ఇతర న్యాయమూర్తులను కూడా భయపెట్టేలా కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నం ఇది' అని జైట్లీ చెప్పుకొచ్చారు.