జైట్లీ అంత్యక్రియలు నేడు: బీజేపీ ఆఫీసులో పార్థీవ దేహం, ప్రముఖుల నివాళులు
న్యూఢిల్లీ: మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అరుణ్ జైట్లీ.. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం 12.07 తుది శ్వాస విడిచారు.
ఢిల్లీ కైలాష్ కాలనీలోని అరుణ్ జైట్లీ నివాసానికి శనివారం సాయంత్రం నుంచి అన్ని పార్టీల నాయకులు చేరుకుని నివాళులర్పించారు. ఆదివారం ఉదయం నుంచి 10.30 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు బీజేపీ ప్రధాన కార్యాలయంలో జైట్లీ పార్థీవదేహాన్ని సందర్శనార్థం ఉంచనున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులర్పించనున్నారు.
నిగమ్బోధ్ ఘాట్ వద్ద మధ్యాహ్నం 2.30గంటలకు అంతిమయాత్ర జరుగుతుందని భారతీయ జనతా పార్టీ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. కాగా, బహ్రెయిన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ.. జైట్లీ మరణ వార్త విని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తాను తన ఆప్త మిత్రుడిని కోల్పోయానంటూ కన్నీటిపర్యంతమయ్యారు.
మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తర్వాత మరో ఆప్తమిత్రుడిని కోల్పోవడం తనను ఎంతో బాధకు గురిచేసిందని అన్నారు. వెంటవెంటనే ఇద్దరు మిత్రులను కోల్పోవడం తనను ఎనలేని వేదనకు గురిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.