అరుణ్ జైట్లీకి కిడ్నీ ఆపరేషన్ విజయవంతం
న్యూఢిల్లీ: కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీకి సోమవారం నాడు ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు. ఈ మేరకు ఎయిమ్స్ వైద్యులు ఓ ప్రకటన విడుదల చేశారు . జైట్లీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు.
కిడ్నీ శస్త్రచికిత్స కోసం ఎయిమ్స్ ఆసుపత్రిలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శనివారం నాడు చేరారు. శని, ఆదివారాల్లో అన్ని రకాల పరీక్షలను పూర్తి చేశారు. సోమవారం నాడు ఉదయం 8 గంటలకు జైట్లీకి వైద్యులు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ మేరకు ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా సోదరుడు డాక్టర్ సందీప్ గులేరియా ఈ ఆపరేషన్ నిర్వహించారు.
సందీప్ ప్రముఖ నెఫ్రాలజిస్ట్. అంతేకాదు అరుణ్ జైట్లీకి కూడ సందీప్ సన్నిహితుడు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ శస్త్రచికిత్స కారణంగా లండన్ లో జరిగిన భారత్ అమెరికా ఎకానమిక్ , ఫైనాన్షియల్ సదస్సుకు వెళ్ళే పర్యటనను కూడ రద్దు చేసుకొన్నారు. జైట్లీకి కొన్నేళ్ళ క్రితం జైట్లీకి కూడ గుండె సంబంధిత సర్జరీ కూడ అయింది.