జైట్లీ తప్పుకునే ఛాన్స్, మోడీ కేబినెట్లో ఆర్థికమంత్రి ఎవరు?
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ అధ్భుత విజయం సాధించింది. వరుసగా రెండోసారి స్పష్టమైన మెజార్టీతో అధికారం దక్కించుకుంది. ఈ నేపథ్యంలో మార్కెట్లు.. ఈసారి మోడీ కేబినెట్లో ఆర్థికమంత్రి పదవి ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొని ఉంది. అనారోగ్యం కారణంగా అరుణ్ జైట్లీ మరోసారి ఆ బాధ్యతలు స్వీకరించకపోవచ్చునని భావిస్తున్నారు.
కొత్త రేషన్ కార్డుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఆర్థిక బాధ్యతలకు జైట్లీ దూరం
అరుణ్ జైట్లీ వయస్సు ఇప్పుడు 66. గత కొన్ని నెలలుగా ఆరోగ్యం బాగా లేదు. ఈ కారణంగా ఈసారి ఈ పదవిని ఆయన కోరుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో పీయూష్ గోయల్ వైపు అందరి చూపులు వెళ్లాయి. అయితే మోడీ.. గోయల్కు అవకాశం ఇస్తారా లేక మరో మంచి ప్రత్యామ్నాయం చూస్తారా అనేది చూడాలి. 'అనారోగ్యం కారణంగా అరుణ్ జైట్లీ మాత్రం ఈసారి ఆర్థికమంత్రి పదవి తీసుకోరు. ఎందుకంటే ఆర్థికమంత్రి అంటే రెస్ట్లెస్ వర్క్' అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ బీజేపీ నేత చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.
కొత్త ముఖాలు
ఈ రోజు (శుక్రవారం) కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. దీనిని రద్దు చేయనున్నారు. అనంతరం నెల రోజుల్లో మోడీ ప్రమాణ స్వీకారం, కేబినెట్ కూర్పు జరగనుంది. జైట్లీ కాకపోతే... ఆర్థిక మంత్రిగా బాధ్యతలను మోడీ ఎవరికి ఇస్తారనే మార్కెట్ వర్కాలు ఆసక్తిగా చూస్తున్నాయి. మోడీ కేబినెట్లో ఈసారి కొత్త ముఖాలు కనిపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
పీయూష్ గోయల్కు ఎక్కువ ఛాన్స్
ఆర్థికమంత్రిగా పీయూష్ గోయల్కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. గతంలో జైట్లీ చికిత్స కోసం వెళ్లినప్పుడు ఆ బాధ్యతలను గోయల్ తీసుకున్నారు. కాబట్టి ఆయన పేరు ప్రచారంలో వినిపిస్తోంది. అలాగే, విదేశాంగ శాఖ మంత్రిగా సుష్మాస్వరాజ్ కొనసాగుతారా లేదా తెలియాల్సి ఉంది. ఆమె ఆరోగ్యం కూడా సహకరించడం లేదని తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు మోడీ కేబినెట్లో చోటు దక్కనుంది. షాకు హోంశాఖ, రాజ్నాథ్ సింగ్కు డిఫెన్స్ మినిస్ట్రీ ఇవ్వనున్నారని ప్రచారం సాగుతోంది. నిర్మలా సీతారామన్కు ఏదైనా కీలక పదవి ఇవ్వవచ్చునని భావిస్తున్నారు. అమెథిలో రాహుల్ గాంధీని ఓడించిన స్మృతి ఇరానీకి ప్రమోషన్ రావొచ్చునని చెబుతున్నారు. రవిశంకర్ ప్రసాద్కు మరో కీలకమైన శాఖ ఇవ్వవచ్చునని అంటున్నారు. ముక్తార్ అబ్బాస్ నక్వీకి ఈసారి కేబినెట్ ర్యాంక్ వచ్చే అవకాశాలు తక్కువ అంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్, ప్రకాశ్ జవదేకర్, జగత్ ప్రకాశ్ నడ్డాలను కేబినెట్లో కొనసాగించవచ్చునని భావిస్తున్నారు.