గ్యాంగ్రేప్ చేశారు: ముఖ్యమంత్రి పెమాపై యువతి సంచలన ఆరోపణలు
Recommended Video
ఈటానగర్: తనపై అరుణాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ అత్యాచారం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. 2008 జులైలో పేమా, మరో ముగ్గురు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తన ఫిర్యాదులో సదరు యువతి పేర్కొంది.
అయితే, ఆ సమయంలో తాను స్పృహలో లేనని చెప్పింది. ఈ విషయంలో తనకు ఇప్పటి వరకు ఎవరి నుంచి ఎలాంటి సాయం అందలేదని తెలిపింది.
గ్యాంగ్ రేప్ చేశారంటే నమ్మడం లేదు
ముఖ్యమంత్రి తనపై అత్యాచారం చేశాడంటే ప్రజలు కానీ, పోలీసులు కానీ నమ్మడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనపై అత్యాచారం జరిగినప్పుడు ఆయన సీఎం పదవిలో లేడని, ఇప్పుడు ఆయన సీఎం అయ్యేసరికి తన మాటలు ఎవ్వరూ నమ్మడం లేదని తెలిపింది.
ఎవర్నీ నమ్మలేరు
ఈ క్రమంలో ఓ మహిళా న్యాయవాది సాయంతో జాతీయ మహిళా సంఘాన్ని ఆశ్రయించారు. తనకు ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే తనలాంటి బాధితులు ఇంకెవర్నీ నమ్మలేరని చెప్పింది.
పబ్లిసిటీ కోసం కాదు
ఇదంతా తాను పబ్లిసిటీ కోసం చేస్తున్నానని సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారని, పాపులారిటీ కోసం ఇంత నీచానికి దిగజారే మనిషిని తాను కాదని తెలిపింది. న్యాయం కోసం తన ప్రాణమున్నంత వరకు పోరాటం చేస్తానని సదరు యువతి పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
అంతా కుట్రే.. దిగజారుడు రాజకీయాలు
కాగా, సదరు యువతి చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, రాజకీయ కుట్రలో భాగంగానే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని రాష్ట్ర బీజేపీ పేర్కొంది. ప్రతిపక్ష పార్టీలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. ఇలాంటి దిగజారుడు పనులతో భవిష్యత్ తరాలకు ఏమి సందేశమిస్తున్నారని బీజేపీ అధ్యక్షుడు తాపీర్ గోవా ప్రతిపక్ష నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.