6గురు అరెస్ట్: గవర్నర్ భార్యనే దోచుకోవాలని చూశారు
ఇటానగర్: భారత్లో సామాన్య ప్రజలకే కాదు... గవర్నర్ భార్యకు కూడా రక్షణ కరువైందని నిరూపించే సంఘటన ఇది. సాక్షాత్తూ గవర్నర్ భార్య వద్ద దొంగలు తమ చేతివాటాన్ని చూపించారు. అయితే వారి ప్రయత్నం ఫలించలేదు. వివరాల్లోకి వెళితే... అదివారం ఉదయం అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జేపీ రాజ్ఖోవా భార్య రీటా రాజ్ఖోవా పని నిమిత్తం ఆదివారం అస్సాంలోని గౌహతి నుంచి ఇటానగర్కు కారులో వెళుతున్నారు.
ఆమెతో పాటు డ్రైవర్, ఓ సెక్యూరిటీ మాత్రమే ఉన్నారు. ఆదివారం ఉదయం 11.45 గంటల సమయంలో కారు సోనాపూర్ టౌన్కు సమీపంలోకి రాగానే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మారుతి స్విప్ట్ డిజైర్ కారులో ఆమె వాహనాన్ని వెంబడించారు. ఆపదలో ఉన్నామని కారుని ఆపమని అందులోని వ్యక్తులు సైగలు చేస్తూ వెంబడించారు.
అయితే దీనిని గమనించిన ఆమె ఆ కారులోని వ్యక్తులు తనకు తెలిసిన వారు కాకపోవడంతో కారు ఆపగపోగా, తన డ్రైవర్ని మరింత వేగంగా వెళ్లమని చెప్పారు. అయినప్పటికీ ఆ దుండగులు ఆమె కారుని వెంబడించడంతో తన భర్త రాజ్ఖోవాకు ఫోన్ చేశారు. ఈ సమయంలో దుండగులు కారు ఆమె కారుని రెండు సార్లు ఓవర్ టేక్ ప్రయత్నించినప్పటికీ, ఎలాగొ తప్పించుకుని డ్రైవర్ చాకచక్యంతో కారుని అస్సాంలోని జాగిరోడ్డు పోలీస్ స్టేషన్లోనికి పోనిచ్చాడు.
దీంతో వెంటనే రాజ్ఖోవా అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ డీజీపీలకు సమాచారం అందించి సెక్యూరిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆమె కారుని చుట్టుముట్టి క్షేమంగా రాజ్ భవన్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్ట్ చేసిన నిందితుల్లో ముగ్గురు అస్సాంకు చెందిన వారు కాగా, మరో ఇద్దరు ఉత్తర ప్రదేశ్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. నిందితులు దోపిడీ కోసమే వచ్చినట్టు ప్రాథమికి దర్యాప్తులో తేలినట్లు అస్సాంకు చెందిన సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.