
అరుణాచల్ ప్రదేశ్పై విషం చిమ్మిన చైనా: వెంకయ్య నాయుడి టూర్ పట్ల ఆగ్రహం: తప్పుపట్టిన కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతం లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద తరచూ భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉద్రిక్తతలకు కారణమౌతోన్న డ్రాగన్ కంట్రీ చైనా.. మరో వివాదానికి తెర తీసింది. చైనాతో సరిహద్దులను పంచుకుంటోన్న ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో పెద్ద ఎత్తున గ్రామాలను నిర్మాణానికి పూనుకుని కలకలం రేపిన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు మళ్లీ ఆ రాష్ట్రంపై కన్నేసింది. లఢక్ తరహాలోనే అరుణాచల్ ప్రదేశ్లోనూ ఉద్రిక్త పరిస్థితులకు కారణమౌతోంది.

అరుణాచల్లో దుందుడుకు..
అరుణాచల్ ప్రదేశ్లోని సరిహద్దు ప్రాంతాలను తమది చూపించుకుంటూ ఇదివరకు మ్యాప్లను సైతం ముద్రించింది చైనా. ఆ భూభాగం మొత్తం తమదేనంటూ మొదటి నుంచీ చెప్పుకొంటూ వస్తోంది. భారత భూభాగానికి అతి సమీపంలో ఓ గ్రామాన్ని సైతం నిర్మించింది. అందులో పెద్ద ఎత్తున స్థానికులకు నివాస వసతిని కల్పించడానికి చర్యలు తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం.. చైనా చర్యలను తప్పు పడుతున్నప్పటికీ.. వెనక్కి తగ్గట్లేదు. తన దుందుడుకు చర్యలను కొనసాగిస్తోంది.

మళ్లీ విషం కక్కిన చైనా..
తాజాగా- మరోసారి అరుణాచల్ ప్రదేశ్పై విషాన్ని కక్కింది డ్రాగన్ కంట్రీ. ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చేపట్టిన అరుణాచల్ ప్రదేశ్ పర్యటన పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. వెంకయ్య నాయుడు అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించడాన్ని అభ్యంతరం తెలుపుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖకు సమాచారాన్ని సైతం పంపించింది. ద్వైపాక్షిక ఒప్పందాల ఉల్లంఘనగా అభివర్ణించింది. ఇలాంటి పర్యటనలు, చర్యలు భవిష్యత్తులో చేపట్టకూడదని సూచించినట్లు తెలుస్తోంది.

తప్పు పట్టిన కేంద్రం..
చైనా అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పు పట్టింది. ఘాటుగా స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ అనేది.. భారత్లో అంతర్భాగమని స్పష్టం చేసింది. ఇందులో ఎలాంటి చర్చలకు అవకాశం లేదని తేల్చి చెప్పింది. భారత్కు చెందిన ప్రముఖులు ఎప్పుడైనా అరుణాచల్ ప్రదేశ్ను సందర్శిస్తారని తేల్చి చెప్పింది. ప్రముఖుల రొటీన్ చర్యల్లో ఇదొక భాగమేనని పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఓ ప్రకటన విడుదల చేశారు.
అరుణాచల్ మాదే..
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించడాన్ని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఝావో లీజియన్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, దాన్ని తాము తోసిపుచ్చుతున్నామని అన్నారు. భారత్లో అరుణాచల్ ప్రదేశ్ ఓ భాగమనే విషయాన్ని చైనాకు పదేపదే గుర్తు చేయాల్సి వస్తోందని చెప్పారు. భారత్లో ఏ ఇతర రాష్ట్రంలోనైనా పర్యటించినట్టే.. అదే స్వేచ్ఛతో అరుణాచల్ ప్రదేశ్లోనూ ప్రముఖులు పర్యటిస్తారని స్పష్టం చేశారు.

ఉద్రిక్తతలను తగ్గించుకోండి..
భారత్-చైనా పశ్చిమ ప్రాంతంలో సరిహద్దుల్లో డ్రాగన్ కంట్రీ తరచూ ఉద్రిక్తతలో కారణమౌతోందని, దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని అరిందమ్ బాగ్చీ సూచించారు. సరిహద్దుల్లో కొనసాగుతోన్న స్టేటస్ కోను ఉల్లంఘించేలా చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు ప్రవర్తిస్తున్నాయని అన్నారు. ఈ చర్యలు ద్వైపాక్షిక ఒప్పందాల ఉల్లంఘన కిందికి వస్తాయని చెప్పారు. లఢక్ తూర్పు ప్రాంతంలోనూ చైనా.. ప్రొటోకాల్స్కు అనుగుణంగా నడచుకోవాలని హితవు పలికారు.

9న వెళ్లొచ్చిన వెంకయ్యనాయుడు..
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొద్దిరోజుల కిందటే అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించారు. ఈ నెల 9వ తేదీన ఆయన ఇటానగర్కు వెళ్లారు. అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఉద్దేశించిన ఆయన ప్రసంగించారు. దీన్ని చైనా తప్పు పట్టింది. ఉప రాష్ట్రపతి స్థాయి నాయకులు అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించడం వల్ల ద్వైపాక్షిక ఒప్పందాలకు భంగం వాటిల్లుతుందని పేర్కొంది.