బీజేపీకి గట్టి దెబ్బ.. ఇద్దరు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు సహా 25 మంది గుడ్ బై
ఇటానగర్ : ఈశాన్య భారతాన బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. ఎన్నికల వేళ కమలనాథులకు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. టికెట్ల పంచాయితీ కమలం పువ్వును ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. 25 మంది బీజేపీ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఆ క్రమంలో మరికొంత మంది కమలం గూటిని వీడబోతున్నారనే ప్రచారం బీజేపీ శ్రేణులను కలవరపెడుతోంది.
బీజేపీకి ఊహించని పరిణామం
అరుణాచల్ ప్రదేశ్లో వచ్చే నెల అసెంబ్లీతో పాటు లోక్సభ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ బీజేపీకి చెందిన ఇద్దరు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడటం చర్చానీయాంశంగా మారింది. వీరంతా నేషనల్ పీపుల్స్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం విశేషం. ఎన్నికల వేళ సడెన్ గా పార్టీ మారడంతో రాజకీయం వేడెక్కింది.
గోవా కుర్చీపై కొత్త సీఎం ధీమా.. అటు కాంగ్రెస్ మార్క్.. రిసార్టుకు చేరిన రాజకీయం
సిట్టింగులకు టికెట్లివ్వరా..!
రానున్న ఎన్నికల్లో బీజేపీ అనుసరిస్తున్న స్ట్రాటజీ తాజా పరిణామాలకు కారణమైంది. హోంమంత్రి కుమార్ వసీ, పర్యాటక శాఖ మంత్రి జర్కర్ గామ్లిన్ తో పాటు మరో ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లిచ్చేందుకు బీజేపీ పెద్దలు తిరస్కరించారు. దాంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఈ 8 మంది నేతలు కమలం గూటిని వీడారు. మంగళవారం నాడు నేషనల్ పీపుల్స్ పార్టీలో చేరిపోయారు. వీరితో పాటు 19 మంది బీజేపీ లీడర్లు కూడా ఎన్పీపీ గూటికి చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిలో బీజేపీ జనరల్ సెక్రటరీ జర్పుమ్ గాంబిన్ ఉండటం చర్చానీయాంశంగా మారింది.
వలసల బాట..!
అటు మరో ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయాలో నేషనల్ పీపుల్స్ పార్టీతో కలిసి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగిస్తోంది.
అరుణాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎన్పీపీ ఒంటరిగానే పోటీ చేస్తోంది. అధికార పార్టీ బీజేపీని కాదని 25 మంది నేతలు నేషనల్ పీపుల్స్ పార్టీలో చేరడం కమలనాథులను కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి. అయితే సిట్టింగులను కాదంటూ కొత్తవారికి బీజేపీ టికెట్లు కట్టబెడుతుండటం ఆ పార్టీశ్రేణులను అసంతృప్తికి గురిచేస్తోంది. అందుకే బీజేపీని వీడి వలసల బాట పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది.