బిజెపి ఖాతాలో 14: అరుణాచల్ ప్రభుత్వంలో పాగా!
న్యూఢిల్లీ/ఈటానగర్: మరోసారి అరుణాచల్ప్రదేశ్ రాజకీయాలు దేశ వ్యాప్తంగా వార్తల్లోకెక్కాయి. ఇప్పటికే పలుమార్లు చోటు చేసుకున్న రాజకీయ సంక్షోభాల నుంచి గట్టెక్కిన అరుణాచల్ప్రదేశ్ ప్రభుత్వంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేమంటే.. ఇప్పటివరకూ ప్రతిపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ అధికార పక్షంలోకి రానున్నట్లు తెలుస్తోంది.
అరుణాచల్ బిజెపి నేత తమియో తగాను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ముఖ్యమంత్రి పెమా ఖండూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో అరుణాచల్ ప్రభుత్వంలోకి బిజెపి అడుగుపెట్టేందుకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది.
ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరిగిన పరిణామాల్లోకి వెళితే... కొద్ది నెలల క్రితం అరుణాచల్లో రాజకీయ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. కాంగ్రెస్లో కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో రాష్ట్రంలో అనిశ్చితి ఏర్పడింది. దీంతో సీఎం నబమ్ టుకి ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించారు.
అయితే అరుణాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో నబమ్ స్థానంలో నాటకీయ పరిణామాల మధ్య పెమా ఖందూ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే గత సెప్టెంబర్లో సీఎం పెమా ఖండూ సహా.. కాంగ్రెస్ పార్టీకిచెందిన మెజార్టీ ఎమ్మెల్యేలంతా పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ప్రదేశ్ (పీపీఏ)లో చేరారు.
అరుణాచల్ శాసనసభలో 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలుండగా.. వీరిలో 43 మంది పీపీఏలో చేరారు. అయితే, బిజెపి ఏర్పాటుచేసిన ఈశాన్య డెమోక్రటిక్ కూటమిలో పీపీఏ పార్టీ కూడా ఉంది. దీంతో పరోక్షంగా అరుణాచల్ ప్రభుత్వంలోకి బిజెపి వస్తుందనే ఊహాగానాలు అప్పట్నుంచే వినిపించాయి.
తాజాగా బిజెపికి చెందిన ఓ నేతను కేబినెట్లో తీసుకునే యోచనలో పెమా ఖండూ ఉన్నట్లు వార్తలు రావడంతో ఆ ఊహాగానాలు బలపడుతున్నాయి. ఒకవేళ ఇదే గనుక జరిగితే.. దేశంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బిజెపి అధికారంలో ఉన్న 14వ రాష్ట్రంగా అరుణాచల్ ఏర్పడనుంది. ప్రస్తుతం అరుణాచల్ అసెంబ్లీలో 11 మంది బిజెపి ఎమ్మెల్యేలున్నారు.