జాక్ పాట్ అంటే ఇదే.. ఆ ఊరిలో అందరూ కోటీశ్వరులయ్యారు!
ఈటానగర్: అదొక చిన్న గ్రామం.. ఆ గ్రామంలో ఉన్నదే 31 కుటుంబాలు. నిత్యం కాయకష్టం చేసి పొట్టపోసుకునే ఆ ఊరి ప్రజలు తంతే బూర్లె గంపలో పడ్డట్లు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు. దీంతో గ్రామస్థులంతా కోటీశ్వరులైన గ్రామంగా ఆ ఊరు రికార్డులకెక్కింది.
అరుణాచల్ప్రదేశ్ తవాంగ్ జిల్లాలోని బోంజా గ్రామం ఈ ఘనతను సాధించింది. ఆ గ్రామంలోని వారంతా ఇప్పుడు సంపన్నులే. వారంతా ఆసియా దేశాల్లో సంపన్నుల సరసన నిలిచారు. వీరికి అనూహ్యంగా ఇంత సంపద ఎలా వచ్చి పడిందో తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు.
భూసేకరణలో భూమి కోల్పోయిన వారికి రక్షణ మంత్రిత్వ శాఖ అందించిన పరిహారంతో బోంజా గ్రామస్తులంతా రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు. ఆ గ్రామంలోని 31 కుటుంబాలకు రూ 40.83 కోట్ల పరిహారాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది.
ఈ గ్రామంలో భారత ఆర్మీ తన అవసరాల కోసం 200 ఎకరాల భూమిని సేకరించినంది. దీనికి సంబంధించిన పరిహారం కోసం ఎంతోకాలంగా గ్రామస్థులు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆర్మీ నష్టపరిహారాన్ని అందించడంతో ఆ గ్రామ ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ఈ మేరకు నష్టపరిహారం పొందిన గ్రామస్థులలో ఓ వ్యక్తికి రూ 6.73 కోట్లు రాగా, ఓ కుటుంబానికి రూ 2.44 కోట్లు అందాయి. 31 కుటుంబాల్లో 29 కుటుంబాలకు రూ కోటి 9 లక్షల పైనే పరిహారం దక్కింది. దీంతో బోంజా గ్రామస్థులు రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు.
అంతేకాదు, గ్రామస్థులంతా కోటీశ్వరులైన గ్రామంగా బోంజా రికార్డులకెక్కింది. రక్షణ శాఖ కీలక స్ధావర ప్రణాళికా యూనిట్లను నెలకొల్పేందుకు ఈ భూమిని సేకరించారు. అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ గ్రామస్థులకు ఈ మేరకు పరిహారం చెక్కులను పంపిణీ చేశారు.