కరోనా బారిన పడిన మరో ముఖ్యమంత్రి: హోంఐసోలేషన్లో పెమా ఖండూ
ఈటానగర్: అరుణాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ కరోనావైరస్ బారినపడ్డారు. ఆర్టీ పీసీార్ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలందని మంగళవారం ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించారు. ప్రస్తుతం న్యూఢిల్లీలో హోంఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపారు.
'నేను ఆర్టీ పీసీఆర్ కోవిడ్ 19 పరీక్షలు చేయించుకున్నాను. అందులో నాకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ప్రస్తుతం నాకు ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవు. ఆరోగ్యంగానే ఉన్నాను' అరుణాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ తెలిపారు.
ఇతరుల భద్రత కోసం తాను ఐసోలేషన్లో ఉంటున్నట్లు ఆయన తెలిపారు. ఇక ఇటీవల తనతో సంప్రదింపులు జరిపినవారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నట్లు సీఎం పెమా ఖండూ తెలిపారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురు సీఎంలు, కేంద్రమంత్రులు, ఎంపీలు కరోనా బారినపడిన విషయం తెలిసిందే.
ఇక అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగానే నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో 6297 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1755 యాక్టివ్ కేసులున్నాయి. 4531 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 11 మంది కరోనాతో మరణించారు. 2 లక్షలకుపైగా కరోనా పరీక్షలు నిర్వహించారు.
దేశ వ్యాప్తంగా 50 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 10 లక్షలకు చేరువలో యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 39 లక్షలకుపైగా కరోనా నుంచి కోలుకున్నారు. 82 వేల మంది కరోనా బారినపడి మరణించారు. తాజాగా, 80 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 70వేలకు పైగా కరోనా నుంచి కోలుకున్నారు.