షాకింగ్: పతనం దిశగా బీహార్ సర్కార్ -సీఎం పదవి వద్దన్న నితీశ్ -బీజేపీ గూటికి జేడీయూ ఎమ్మెల్యేలు -కలకలం
ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ లో చోటుచేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాలు.. తూర్పు రాష్ట్రమైన బీహార్ లో ఎన్డీఏ సర్కారు పతనానికి దారులు తీశాయి. కూటమి నేతగా నితీశ్ కుమార్ ను నెత్తిన మోస్తోన్న బీజేపీ.. ముందు నుంచీ ఊహించినట్లుగానే జేడీయూకు భారీ షాకిచ్చింది. కాషాయ దెబ్బకు డంగైపోయిన నితీశ్.. తానిక బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగలేనని స్పష్టం చేశారు. కానీ బీజేపీ మాత్రం ఈ గొడవలు టీకప్పులో తుఫాను వంటివని, బీహార్ లో పరిస్థితులు 'ఆల్ ఈజ్ వెల్'అని డాంబికం ప్రదర్శిస్తోంది..
బీజేపీ ఎత్తులకు సీఎం నితీశ్ చెక్ -జేడీయూ కొత్త అధ్యక్షుడిగా ఆర్సీపీ సింగ్ -భంగపడ్డ ప్రశాంత్ కిషోర్
జేడీయూ ఎమ్మెల్యేలు జంప్..
బీహార్ సీఎంగా తాను కొనసాగబోనని, మెజార్టీ సీట్లు సాధించిన బీజేపీ తన అభ్యర్థినే ముఖ్య పోస్టులో కూర్చోబెట్టాలని నితీశ్ కుమార్ మరోసారి అలకబాట పట్టడానికి బలమైన కారణాలున్నాయి. ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ లో జేడీయూకు మొత్తం 7గురు ఎమ్మెల్యేలు ఉండగా, అందులో ఆరుగురు ఎమ్మెల్యేలు గత శుక్రవారం నితీశ్ కు ఝలకిచ్చి, బీజేపీలో చేరిపోయారు. జేడీయూఎల్పీ మొత్తాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు లేఖలు రాయడంతో ఆ ఆరుగు ఎమ్మెల్యేలపై నితీశ్ కనీసం చర్యలు కూడా తీసుకునే వీలు లేకుండా పోయింది. అరుణాచల్ ప్రదేశ్ మాదిరిగానే బీహార్ లోనూ జేడీయూ ఎమ్మెల్యేలను బీజేపీ తనవైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోందన్న సమాచారంతో నితీశ్ తన ఆక్రోషాన్ని వెళ్లగక్కారు..
సీఎం పదవిపై ఆసక్తి లేదు..
బీహార్ ఎన్డీఏలో బీజేపీ, జేడీయూ భాగస్వాములు అయినప్పటికీ, అరుణాచల్ ప్రదేశ్ లో ప్రత్యేకమైన పొత్తేదీ లేదు. దీంతో అక్కడి ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలను బీజేపీ తనలో కలిపేసుకుంది. పొత్తుల ధర్మానికి ఇది విరుద్ధమని వాదిస్తోన్న జేడీయూ.. బీజేపీ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది. మా సంస్కారాన్ని చేతగానితనంగా చూడొద్దని జేడీయూ కొత్త అధ్యక్షుడు ఆర్సీపీ సింగ్ హెచ్చరించారు. ఈ క్రమంలోనే నితీశ్ కుమార్ మరో అడుగు ముందుకేసి.. బీహార్ ముఖ్యమంత్రి పదవిపై తనకు ఆసక్తిలేదని విరక్తివాక్యాలు వల్లెవేశారు. అసలు..
బీజేపీ బలవంతం చేస్తేనే..
‘‘ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలనే ఆశ నాకు లేదన్న విషయాన్ని ఎన్నికల ఫలితాల రోజే మీడియా ముఖంగా చెప్పాను. కానీ బీజేపీనే బలవంతంగా నన్ను ముఖ్య పదవిలో కూర్చోబెట్టింది. ఈ నెలరోజుల పదవీకాలంలో నా అభిప్రాయంలో ఎలాంటి మార్పు లేదు. ఎన్నికల ఫలితాల్లో ప్రజా తీర్పు బీజేపీకి అనుకూలంగా వచ్చింది. కాబట్టి ఆ పార్టీ నేతల్లో ఒకరు సీఎం పదవిని తీసుకోవాలి. నేను ఈ క్షణమే తప్పుకోడానికి సిద్ధంగా ఉన్నాను'' అని జేడీయూ జాతీయ కార్యనిర్వాహక సమావేశంలో నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. అరుణాచల్ ప్రదేశ్ లో జేడీయూ ఎమ్మెల్యేలను బీజేపీలోకి చేర్చుకోవడం నూరు శాతం అనైతిక చర్య అని సమావేశం ఏకాభిప్రాయానికి వచ్చింది. జేడీయూ ఆగ్రహం, నితీశ్ విరక్తి వ్యాఖ్యలపై బీజేపీ వేగంగా స్పందించింది..
అరుణాచల్ వేరు.. బీహార్ వేరు
బీహార్ లో ఎన్డీఏ కూటమి చాలా బలంగా ఉందని, అరుణాచల్ ప్రదేశ్ లో చోటుచేసుకున్న పరిణామాల ప్రభావం బీహార్ పై ఉండబోదని బీజేపీ నేతలు బల్లగుద్ది చెబుతున్నారు. బీజేపీకి సంబంధించినంత వరకు అరుణాచల్ ప్రదేశ్, బీహార్ లలో వేర్వేరు స్ట్రాటజీలు అవలంభిస్తున్నదని, బీహార్ లో జేడీయూతో పొత్తు ఉంది కాబట్టి.. అరుణాచల్ మాదిరిగా ఎమ్మెల్యేలను చేర్చుకోబోమని, ఈ విషయంలో సీఎం నితీశ్ గానీ, జేడీయూకు చెందిన ఇతర నేతలుగానీ అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దని బీజేపీ నేతలు భరోసా ఇస్తున్నారు. బీహార్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఐదేళ్లు నిక్షేపంగా ఉంటుందని చెబుతున్నారు. అందులో భాగంగా..
నితీశ్ ఉండాల్సిందే.. అదే ప్రజాతీర్పు
అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీలోకి జేడీయూ ఎమ్మెల్యేల చేరిక వ్యవహారం ఆ రాష్ట్రానికే పరిమితమని, బీహార్ లో మాత్రం ఎన్డీఏ కూటమికి నితీశ్ కుమారే నాయకుడని బీజేపీ అగ్రనేత, మాజీ డిప్యూటీ సీఎం, ప్రస్తుత రాజ్యసభ ఎంపీ సుశీశ్ కుమార్ మోదీ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం పదవిని నితీశ్ తిరస్కరించడం తగదని, సీట్ల సంఖ్యతో సంబంధం లేకుండా ఎన్డీఏకు మెజార్టీ వస్తే నితీశే సీఎం అవుతారని ఎన్నికలకు ముందు నుంచీ బీజేపీ చెబుతూ వచ్చిందని, ప్రజాతీర్పు కూడా నితీశ్ నాయకత్వానికే లభించినందని మోదీ గుర్తుచేశారు. బీహార్ లో జేడీయూ-బీజేపీ మధ్య సంబంధాలు ఆరోగ్యకరంగా, సంతృప్తికరంగా ఉన్నాయని సుశీల్ మోదీ తెలిపారు. అయితే..
నితీశ్ దిగిపోవడం ఖాయమంటూ..
అరుణాచల్ ప్రభావం బీహార్ పై ఉండబోదని బీజేపీ నేతలు ఎంత గట్టిగా చెబుతున్నా జేడీయూ నేతలు నమ్మేపరిస్థితిలో లేరని, జేడీయూకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా బీజేపీ ఇచ్చిన సంకేతం సాధారణమైనదేమీ కాదని, ఇప్పటికే చిరాగ్ పాశ్వాన్-బీజేపీల చీకటి ఒప్పందంతో దెబ్బయిపోయిన నితీశ్ కుమార్ ఇకనైనా మేల్కొనకపోతే జేడీయూ పుట్టి మునగడం ఖాయమని, ఈ విషయాన్ని గ్రహించారు గనుకే సీఎం పదవిని వదులుకోడానికి ఆయన సిద్ధపడ్డారని పొలిటికల్ విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇప్పటికిప్పుడు బీజేపీని వీడి ఆర్జేడీతో పొత్తు పెట్టుకోలేని దుస్థితిలో ఉన్న నితీశ్.. బీజేపీ బారి నుంచి జేడీయూను కాపాడుకునే దిశగా చేస్తోన్న ప్రయత్నాలు ఏమేరకు సఫలం అవుతాయో చూడాలి. బీజేపీ ఎత్తులకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే నితీశ్.. జేడీయూ అధ్యక్ష పదవిని నమ్మకస్తుడైన ఆర్సీపీ సింగ్ కు కట్టబెట్టారని తెలుస్తోంది. ఈ ప్రయత్నాలేవీ ఫలించకపోతే బీహార్ లో ఎన్డీఏ సర్కారు పతనం ఖాయమని, ఆ రోజులు దగ్గర్లోనే ఉన్నాయనే వాదన కూడా వినిపిస్తోంది.
బిగ్బాస్-4లో నాగార్జున దరిద్రం -భార్య, కోడలితో డేటింగ్ సరేనా? -పవన్కు అంతలేదు: సీపీఐ నారాయరణ