ఢిల్లీలో గొడవ: ఎమ్మెల్యే కొడుకుని కొట్టి చంపారు
న్యూఢిల్లీ: చిన్న వివాదంతో మొదలైన ఘర్షణ ఓ విద్యార్థి ప్రాణం తీసింది. దేశ రాజధాని న్యూఢిల్లీలోని లజ్పత్నగర్లోని మార్కెట్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ గొడవలో మరణించిన విద్యార్థి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నిడో పవిత్ర కుమారుడు నిడో తనియమ్.
తన తల వెంట్రుకల కలర్ గురించి ఓ దుకాణదారు వ్యంగ్యంగా ఎగతాళి చేస్తూ మాట్లాడాడు. దీంతో నిడో తనియమ్కి దుకాణదారుకు మధ్య చోటు చేసుకున్ని చిన్న వివాదంతో వారిద్దరూ ఘర్షణకు దిగారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న కొందరు దుకాణదారు స్నేహితులు నిడో తనయమ్పై విచక్షణారహితంగా దాడికి దిగారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడిన తనయమ్ మృతి చెందాడు.
ఈ ఘటన జనవరి 29న చోటు చేసుకోగా బాధితుడు జనవరి 30న మరణించాడు. అతని హెయిర్ స్టైల్ను ఎగతాళి చేస్తూ, చైనా దేశానికి చెందినవాడని ఆరోపిస్తూ దాడికి దిగారని తనయమ్ కజిన్ తెలిపారు. స్టిక్స్, రాడ్లతో అతనిపై దాడి చేసినట్లు తెలుస్తోంది.
తనియమ్పై దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని అరుణాచల్ప్రదేశ్ వాసులు, సామాజిక కార్యకర్తలు ఢిల్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల భద్రత కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ను డిమాండ్ చేశారు.