దేశంలో ఆయనో విప్లవం: కోట్ల మంది మహిళలకు భరోసానిచ్చిన మహనీయుడు..
దేశంలో 100శాతం మహిళలు శానిటరీ నాప్కిన్స్ వాడాలన్నదే అతని కల.
భూటాన్లో సంతోషాన్నే తమ దేశ జీడీపీగా పరిగణిస్తారు. అసలైన అభివృద్దికి నిర్వచనం ప్రజల జీవితాల్లోని సంతోషమే అనేది ఆ దేశం బలంగా నమ్ముతోంది. కానీ చాలా దేశాల్లో అభివృద్దిని డబ్బుతో ముడిపడి ఉన్న విషయంగానే పరిగణిస్తారు.
అభివృద్ది.. ఆధునికత అనగానే రోడ్లు, భవనాలు, విమానాలు.. వగైరా వంటివన్ని జాబితాలో చేరిపోతాయి. కానీ దేశంలో మనుషులు, మరీ ముఖ్యంగా మహిళల కనీస అవసరాల గురించి కూడా ఎవరూ పట్టించుకోరు. నేటికి కొన్ని లక్షల మంది మహిళలు నెలసరి సమయంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటుండటం ఇందుకు నిదర్శనం.
ఉన్నవాళ్ల కోసం ఎలాగూ శానిటరీ నాప్కిన్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న కుటుంబాల్లో.. అందునా ఆడపిల్లలు ఎక్కువగా ఉన్న కుటుంబాలు.. అన్నేసి డబ్బులు వెచ్చించి శానిటరీ నాప్కిన్స్ కొనే పరిస్థితి లేదు. దానికి తోడు నెలసరి గురించి మాట్లాడటానికి వారికి ఉండే బిడియం.. వారి సమస్యలను మరింత క్లిష్టతరం చేసింది.
100శాతం మహిళలు వాడాలన్నదే అతని ఆశయం!:
ఇప్పటికీ దేశంలో కొన్ని లక్షల మంది గ్రామీణ మహిళలు.. నెలసరి సమయంలో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కారణం.. నెలసరి సమయంలో వారు వాడుతున్న అపరిశుభ్ర గుడ్డ ముక్కలు. శానిటరీ ప్యాడ్స్ కొనుక్కునే స్తోమత లేక.. తప్పనిసరి పరిస్థితుల్లో పాత గుడ్డ ముక్కలను వాడుతుండటంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
అందుకే ఈ దేశంలో 100శాతం మహిళలు నాప్కిన్స్ వాడే రోజు రావాలని అరుణాచలం మురుగనాథం ఆశించాడు. ఒకవిధంగా తన ఆశయం కోసం జీవితాన్నే పణంగా పెట్టాడు. నాప్కిన్స్ తయారీ కోసం అతను చేసిన ప్రయోగాలను చూసి.. భార్య, తల్లి, అక్కా-చెల్లెళ్లు అంతా దూరమయ్యారు. తాను తయారుచేసిన నాప్కిన్స్ పై ఫీడ్ బ్యాక్ ఇవ్వమన్నందుకు అతనేదో చేయకూడని తప్పు చేస్తున్నట్లుగా చూసేవారు.
Recommended Video
మెడికల్ కాలేజీ విద్యార్థినులు కూడా సహకరించలేదు:
ఆఖరికి మెడికల్ కాలేజీ అమ్మాయిలు కూడా ఆయనకు అంతగా సహకరించలేదు. దీంతో మెడికల్ కాలేజీ అమ్మాయిలు వాడి పారేసిన శానిటరీ ప్యాడ్స్ పై కూడా మురుగనాథం ప్రయోగాలు జరిపాడు. తాను తొలుత తయారుచేసిన శానిటరీ ప్యాడ్స్ విఫలం కావడంతో.. దానికి, దీనికి క్వాలిటీలో తేడా ఏముందో పరిశీలించేందుకు ఆ పని చేశాడు.
కానీ ఆ ప్రయోగాలు తల్లి కంటపడి ఆమె కూడా అతనికి దూరమైంది. ఒకానొక రోజు మెడికల్ కాలేజీ అమ్మాయిలు వాడి పారేసిన శానిటరీ ప్యాడ్స్ ను అతను పరిశీలిస్తుండగా.. తల్లి అతన్ని చూసి ఈసడించుకుంది. ఇక అప్పటినుంచి అతనికి దూరమైంది. విషయం ఊరిలో వారందరికీ తెలిసి మురుగనాథంకు దెయ్యం పట్టిందన్న ప్రచారం మొదలైంది.
లేనిపోని ఆరోపపణలు:
అతను తన శానిటరీ ప్యాడ్స్ ప్రయోగాల కోసం కొన్నిసార్లు గ్రామంలోని మహిళలను ఆశ్రయించడం, వారిని ప్రాధేయపడటం చూసి.. వారితో అతనికి అక్రమ సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం మొదలుపెట్టారు. అప్పుడప్పుడు ఊరి చెరువులో రక్తం మరకలున్న దుస్తులను ఉతుకుతుంటే అక్రమ సంబంధాల వల్ల అతనికేదో రోగం వచ్చిందన్న ప్రచారం కూడా చేశారు.
అయితే ఆ రక్తం మరకల వెనుక ఎవరూ ఊహించని కారణం ఉంది. తాను తయారుచేసిన శానిటరీ ప్యాడ్స్ ఫీడ్ బ్యాక్ కోసం ఏ మహిళను సంప్రదించినా చేదు అనుభవమే ఎదురవతుండటంతో.. ఇక లాభం లేదనుకుని తానే రంగంలోకి దిగాడు. తన మీదే ప్రయోగాలు జరుపుకోవాలనుకున్నాడు. కానీ ఎలా?.. అతను మగవాడు కదా!... నెలసరి అతనికి రాదు కదా!
మహిళలు సమస్యను తాను అనుభవించి:
ఫుట్ బాల్ ట్యూబ్ బ్లాడర్ తో కృత్రిమ గర్భాశయాన్ని రూపొందించాడు. రక్త స్రావమయ్యేందుకు దానికి చిన్న రంధ్రాలు చేశాడు. స్థానిక మాంసం దుకాణం వ్యక్తితో మాట్లాడి మేకల రక్తాన్ని తీసుకుని దాన్ని ప్రయోగాలకు ఉపయోగించడం మొదలుపెట్టాడు. ఆ కృత్రిమ గర్భాశయాన్ని ధరించి నడవడం, పరిగెత్తడం చేసేవాడు.
ఆ సమయంలో శానిటరీ ప్యాడ్స్ వాటికి తొడిగి.. వాటి పనితీరు ఎలా ఉందో పరీక్షించేవాడు. అలా ఆయన దుస్తులకు మరకలు అంటుకునేవి. వాటిని చూసి జనం ఆయనకేదో వ్యాధి సోకిందని భ్రమపడేవారు. అయితే ఈ ప్రయోగం కూడా సఫలం కాకపోవడంతో.. స్వంతంగా ఒక మెషిన్ తయారుచేసి శానిటరీ ప్యాడ్స్ రూపొందించాలనుకున్నాడు.
ఇన్నోవేషన్ అవార్డు:
మార్కెట్లో ఉన్న శానిటరీ ప్యాడ్స్ లో ఏ రకం దూది వాడుతున్నారు?.. తన వద్ద ఎలాంటి దూది ఉంది?.. వంటి వివరాలన్ని సేకరించాడు. వెల్డింగ్ పని తెలిసినవాడు కావడంతో.. రెండు, మూడు రోజులు వరుసగా రాత్రి అనక, పగలనక కష్టపడి ఆ డబ్బుతో స్యయంగా ఒక మెషీన్ రూపొందించాడు. ఈ మెషీన్ కు ఇన్నోవేషన్ అవార్డు రావడంతో మురుగనాథం పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది.
బీబీసీ, సీఎన్ ఎన్, అల్ జజీరా వంటి ప్రఖ్యాత చానెల్స్ ఆయన కథనాలను ప్రసారం చేశాయి. ప్రపంచంలోనే తొలిసారిగా మహిళల సమస్యలను తెలుసుకోవడం కోసం.. శానిటరీ ప్యాడ్స్ వాడి మరీ, వారి కోసం చౌక ధరలో వాటిని రూపొందించిన మురుగనాథమ్ ను ప్రతీ ఒక్కరు కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేద అమ్మాయిలు, మహిళలకు సులువుగా, సరసమైన ధరల్లో శానిటరీ ప్యాడ్లు దొరకాలన్న ఉద్దేశంతో మురగనాథమ్ జయశ్రీ ఇండస్ట్రీస్ ఏర్పాటుచేశాడు.
తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన మురగనాథమ్ చేసిన కృషి ప్రపంచవ్యాప్తంగా మహిళలకు ఒక భరోసానిచ్చింది. ఇంకా చెప్పాలంటే ఇదొక నాప్కిన్ విప్లవాన్ని తీసుకొచ్చింది. నెలసరి అంటే భయపడే గ్రామీణ పేద మహిళలకు ఇక ఆ భయం లేకుండా చేసింది. నెలసరి సమయంలో తన భార్య పడుతున్న ఇబ్బందులు చూడలేక.. శానిటరీ ప్యాడ్స్ ప్రయోగాలు మొదలుపెట్టిన అరుణాచలం ఈరోజు ఎంతో మంది మహిళలకు అండగా నిలబడ్డవారయ్యారు. అలాంటి వ్యక్తికి సలాం చెప్పకుండా ఎలా ఉండగలం.