ముచ్చటగా మూడోసారి: రేపే ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న కేజ్రీవాల్..మోడీకి ఆహ్వానం
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఫిబ్రవరి 16 ఆదివారం రోజున ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడో సారి ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించింది. బీజేపీ కాంగ్రెస్లు పిక్చర్లో లేకుండా చేసింది. మొత్తం 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో సామాన్యుడి పార్టీ ఆప్ 62 స్థానాలు గెలువగా... బీజేపీ 8 స్థానాలతో సరిపెట్టుకుంది. 2015లోలానే కాంగ్రెస్ మరోసారి ఖాతా తెరవడంలో విఫలమైంది.
ఇక అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రమాణస్వీకారంకు వేదికగా రామ్లీలా మైదాన్ ముస్తాబైంది. అరవింద్ కేజ్రీవాల్తో ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఢిల్లీలోని ప్రతి సామాన్యుడు ఈ ప్రమాణస్వీకారం వేడుకకు హాజరు కావాలని అరవింద్ కేజ్రీవాల్ ఆహ్వానం పలికారు. అంతేకాదు తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు దేశవ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులను కేజ్రీవాల్ ఆహ్వానించారు.
ప్రమాణస్వీకారం సజావుగా సాగేందుకు ఢిల్లీ పోలీస్ శాఖ గట్టి బందోబస్తు చేపట్టింది. దాదాపు 3వేల మంది పోలీసులను పారామిలటరీ దళాలను దేశ రాజధానిలో మోహరించింది. ఇక రామ్లీలా మైదాన్కు వెళ్లే రహదారుల వెంటా సీసీ కెమెరాలను ఫిక్స్ చేయడం జరిగింది. ఉదయం 10 గంటలకు కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం ప్రారంభం అవుతుంది.
అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఫిబ్రవరి 16న ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ఢిల్లీ పోలీస్ శాఖ తెలిపింది. సివిక్ సెంటర్ వద్ద కార్ పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పిన పోలీసులు బస్సులన్నీ మాతా సుంద్రి రోడ్, పవర్ హౌజ్ రోడ్, వేలోడ్రోమ్ రోడ్, రాజ్ఘాట్ పార్కింగ్, శాంతి వన్ పార్కింగ్ , సర్వీస్ రోడ్ వద్ద పార్కింగ్ చేయాలని సూచించారు.
ఇక మీడియాకు చెందిన ఓబీ వ్యాన్లను జవహర్లాల్ నెహ్రూ మార్గ్లోని ఫుట్పాత్ వెంటా పార్కింగ్ చేసుకునేలా ఏర్పాటు చేశారు. ఇది రామ్లీలా మైదాన్ గేట్ నెంబర్ 2కు ఎదురుగా ఉందని పోలీసులు వివరించారు. ఈ మార్గాల్లో కమర్షియల్ వాహనాలు, బస్సులు ఇతరత్రా వాహనాలకు అనుమతి లేదని చెప్పారు.