మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడ్డవారికి లక్ష, ఎక్స్గ్రేషియా ప్రకటించిన ఢిల్లీ సర్కార్
అనాజ్ మందీ ప్రమాద బాధితులను, మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థికసాయం చేస్తామని పేర్కొన్నారు. గాయపడ్డవారికి రూ.1 లక్ష అందజేస్తామని తెలిపారు. ప్రమాద ఘటనకు గల బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
అనాజ్ మందీ ప్రమాద ఘటనపై మెజిస్టేరియల్ విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అన్నివిధాలా అండగా ఉంటామని హామీనిచ్చారు. మరోవైపు బిల్డింగ్ యాజమాని సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భవనంలో ఫైర్ సేప్టీ చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.
ప్రమాదం జరిగాక పొగచూరడంతో చాలా మంది చనిపోయారు. ఈ విషయాన్ని ఎల్జేఎన్పీ వైద్యుడు ఒకరు ధ్రువీకరించారు. మరోవైపు ఘటనాస్థలం వద్దకు అనురాగ్ ఠాకూర్, మనోజ్ తివారీ చేరుకున్నారు. అనాజ్ మందీ ప్రమాదంతో తన హృదయం కలచివేస్తోందని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోరుకోవాలని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా సంతాపం తెలిపారు.
ప్రమాదంపై గల కారణాలు దర్యాప్తులో తేలుతాయని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొన్నది. ప్రమాదం ఎవరు చేసినా ఉపేక్షించబోమని తేల్చిచెప్పింది. బాధ్యులపై చర్యలు తప్పవని ఢిల్లీ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ స్పష్టంచేశారు. ప్రమాద ఘటన స్థలానికి మంత్రులు చేరుకున్నారు. ఝాన్సీ రోడ్లో ఉన్న పరిశ్రమ 600 చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది. ఉదయం 5.22 గంటలకు ప్రమాదం జరిగి ఉంటుంది. ఆ సమయంలోనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ వచ్చింది.